అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Arvind Dharmapuri Foundation | ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్న అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF) సేవలు ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla) అన్నారు. నగరంలో అరవింద్ ధర్మపురి (Arvind Dharmapuri ) ఫౌండేషన్ ఆధ్వర్యంలో పసిపిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Arvind Dharmapuri Foundation | చిన్నారుల వైద్యానికి..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని గవర్నర్ అందజేశారు. నిరుపేద చిన్నారుల వైద్యానికి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఫౌండేషన్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ‘వసుదైక కుటుంబం’ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు. లబ్ధిదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేయాలని ఫౌండేషన్కు సూచించారు.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, ప్రజలు సమష్టిగా పనిచేస్తే అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరుతాయని అన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ధర్మపురి అరవింద్ను గవర్నర్ అభినందించారు. ఎంపీ తన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను గవర్నర్కు వివరించారు. పసిపిల్లల కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి హాజరైనందుకు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.