అక్షరటుడే వెబ్డెస్క్: Konda Surekha Disciplinary Report | మంత్రి కొండా సురేఖ , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదిక పీసీసీ (PCC) అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు ( Mahesh Kumar Goud) చేరింది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, వైస్ ఛైర్మన్ శ్యామ్ మోహన్ ఈ నివేదికను పీసీసీ అధ్యక్షుడికి అందజేశారు. ఈ ఇద్దరు నేతల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన కమిటీ, తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
Konda Surekha Disciplinary Report | మల్లు రవి కీలక వ్యాఖ్యలు..
నివేదిక సమర్పణ అనంతరం గాంధీభవన్లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి సమర్పించిన వివరణల ఆధారంగానే నివేదిక రూపొందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ (Congress) పార్టీ గౌరవానికి భంగం కలిగించేలా, భవిష్యత్ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఎవరూ ప్రవర్తించరాదని ఆయన స్పష్టం చేశారు.
హద్దులు మీరిన నాయకుల పట్ల క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉండాలని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు. ఈ నివేదికను ఏఐసీసీ (AICC) పెద్దలతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్కు పంపామని, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని మల్లు రవి వెల్లడించారు.
Konda Surekha Disciplinary Report | అధిష్ఠానం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..
ఈ నివేదికలో కమిటీ పలు కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ పార్టీ నిబంధనలను ఉల్లంఘించడం ఇది మూడోసారినని, ఇకపై ఉపేక్షిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే సీనియర్ నేత, క్యాబినెట్ ర్యాంకు హోదాలో ఉన్న చిన్నారెడ్డి కూడా పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ఆయనను కూడా ఆ పదవి నుంచి తప్పించాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Arvind Dharmapuri Foundation | అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా