అక్షరటుడే, వెబ్డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda sai srinivas) ఓ ఇంటివారయ్యారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి, తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో బుధవారం రాత్రి ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. కావ్య రెడ్డి సినీ రంగానికి చెందని వ్యక్తి అయినప్పటికీ, ప్రముఖ న్యాయవాది కుమార్తెగా మంచి గుర్తింపు పొందారు.
Bellamkonda Wedding | హైదరాబాద్లో రిసెప్షన్..
వారి ప్రేమ ప్రయాణం కొన్ని నెలల క్రితమే మొదలైందని తెలిసింది. మార్చిలో జరిగిన ‘రోకా’ వేడుకతో ఈ బంధం అధికారికమైంది. అనంతరం ఏప్రిల్ 5న హైదరాబాద్లో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఏప్రిల్ 27న పెళ్లికొడుకు ఫంక్షన్ కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సందడిగా నిర్వహించారు. ఇక మే 1న హైదరాబాద్లో గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో శ్రీనివాస్ తన ప్రేమను సోషల్ మీడియా (Social Media) ద్వారా వ్యక్తం చేస్తూ, “నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నీ రాకతో నా రోజులు ఆనందంతో నిండిపోయాయి. నీ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోకుండా చూసుకుంటాను” అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు.
Bellamkonda Wedding | తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ‘అల్లుడు శీను’ (Alludu Srinu) చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్, తొలి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తరువాత ఆయన నటించిన రాక్షసుడు చిత్రం ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. నటుడిగా ఆయనలోని వైవిధ్యాన్ని ఈ సినిమా చాటి చెప్పింది. అలాగే ఆయన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు యూట్యూబ్లో వందల మిలియన్ల వ్యూస్ సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రేజ్తోనే ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ చిత్ర రీమేక్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ‘జయ జానకి నాయక’, ‘సాక్ష్యం’ వంటి చిత్రాలతో మాస్, ప్రయోగాత్మక పాత్రల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతేడాది ‘కిష్కింధపురి’తో విజయాన్ని అందుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సాగర్ కె. చంద్రతో ‘టైసన్ నాయుడు’, అలాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హైందవ’ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Samantha Viral Post | ఖర్మ అనుభవించక తప్పదు.. సమంతపై రాజ్ మొదటి భార్య ఎమోషనల్ పోస్ట్!

