అక్షరటుడే వెబ్డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ( Uttarakhand )ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకమైన చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యాత్ర మార్గాల్లోని రహదారులు ప్రయాణానికి సురక్షితంగా లేకపోవడంతోనే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు యంత్రాంగం తెలిపింది.
Char Dham Yatra | అధికారులకు ఆదేశాలు..
గర్వాల్ కమిషనర్ సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్లు , ఉన్నతాధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. యాత్ర మార్గంలో ప్రస్తుతం ప్రయాణిస్తున్న భక్తులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రహదారులు పూర్తిగా సురక్షితమని ధృవీకరించిన తర్వాతే భక్తులను ముందుకు అనుమతించాలని అధికారులను స్పష్టం చేశారు. యాత్రకు సంబంధించిన తాజా సమాచారాన్ని మీడియా , ఇతర కమ్యూనికేషన్ ఛానెళ్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.
Char Dham Yatra | భక్తులకు విజ్ఞప్తి
వాతావరణ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడి, రహదారులు ప్రయాణానికి అనుకూలంగా మారిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక అడ్వైజరీలను మాత్రమే అనుసరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాల అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని యాత్రికులను ప్రభుత్వం కోరింది.
ఇది కూడా చదవండి: Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం