అక్షరటుడే వెబ్డెస్క్: Chhattisgarh Sand Quarry | ఛత్తీస్గఢ్లోని కోరియా జిల్లాలో ఇసుక క్వారీ వివాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఆధిపత్యం కోసం జరిగిన పాత కక్షలు చివరకు మనుషులను సజీవంగా తగులబెట్టే స్థాయికి చేరుకున్నాయి. సోన్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో మంగళవారం (జూన్ 16) రాత్రి జరిగిన ఈ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Chhattisgarh Sand Quarry | అసలేం జరిగిందంటే..
బీజేపీ నేత ( BJP Leader ), మాజీ జనపద్ పంచాయతీ అధ్యక్షుడు భరత్ సింగ్ (లల్లా సింగ్) , ఆయన బంధువులు ఒక వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఫార్చ్యూనర్ కారులో వెళ్లారు. అయితే, అక్కడ మాటు వేసిన ప్రత్యర్థులు పక్కా ప్లాన్ ప్రకారం లారీలతో కారుకు అటు ఇటు అడ్డుగా పెట్టి, బయటకు రాకుండా చేశారు. అనంతరం కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో భరత్ సింగ్ కారులోనే కాలిపోయారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన నాగేంద్ర సింగ్, వీరేంద్ర సింగ్ అనే ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరొకరు మయాంక్ సింగ్ చావుబతుకుల మధ్య అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Chhattisgarh Sand Quarry | కారణం మైనింగ్ వివాదమే..
స్థానిక ఇసుక క్వారీ కాంట్రాక్ట్ భరత్ సింగ్ కుటుంబానికి ఉండగా, రవాణా విషయంలో మరో బీజేపీ నేత మనోజ్ త్రిపాఠి కుటుంబంతో వారికి గొడవలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, వసూళ్ల విషయంలో నెలకొన్న ఈ వివాదాలు గతంలోనే పలుమార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాయి. తాజాగా మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణ ముగ్గురిని బలితీసుకుంది.
Chhattisgarh Sand Quarry | సీఎం హామీ..
ఈ కేసులో ప్రధాన నిందితులు అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠిలతో పాటు మొత్తం తొమ్మిది మందిపై హత్య, హత్యా యత్నం కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి స్పందిస్తూ, సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కోరియా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Venky Anil Movie | వెంకీ, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ప్రారంభం