అక్షరటుడే, వెబ్డెస్క్: Chloroquine Tablet Death | ఏపీలోని పోలవరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మలేరియా రాకుండా ముందు జాగ్రత్తగా వైద్యులు ఇచ్చిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి చిన్నారులు మృతి చెందారు.
ఎటపాక మండలం గొల్ల గుప్ప గ్రామంలో మలేరియా ఉందని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా స్కూల్ పిల్లలతో సహా గ్రామస్తులందరికీ వైద్యుల బృందం ట్యాబ్లెట్లను ఇచ్చింది. వీటిని వేసుకున్న తర్వాత గ్రామంలో 75 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. అందులో పది మంది చిన్నారులు ఉన్నారు. దీంతో స్పందించిన అధికారులు వారిని ఆస్పత్రులకు తరలించారు. భద్రాచలం (Bhadrachalam) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నలుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న మడివి జమున ఏడు సంవత్సరాల అమ్మాయి తాజాగా మృతి చెందింది. ఇటీవల పద్దం రోజా అనే బాలిక చనిపోయింది. తాజాగా మరో ఇద్దరు బాలికలు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Chloroquine Tablet Death | పరామర్శించిన కలెక్టర్
పోలవరం కలెక్టర్ కె. దినేష్ కుమార్ భద్రాచలం ఏరియా ఆసుపత్రిని బుధవారం సందర్శించి, గొల్లగుప్ప గ్రామంలో అనారోగ్య సమస్యకు గురైన వారికి అందుతున్న వైద్య చికిత్సను సమీక్షించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలిక మాడివి జమున మరణించగా, మిగిలిన బాధితులు నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. గొల్లగుప్పలో పరిస్థితి అదుపులో ఉందని, అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు తీసుకుందని కలెక్టర్ తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా, లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో చికిత్స పొందుతున్న 23 మందిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 52 మంది బాధితులు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Srivari Temple ACB Searches | శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు