అక్షరటుడే, వెబ్డెస్క్: Cockroach Janata Party | ప్రస్తుతం దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ‘కాక్రోచ్’ (బొద్దింక) ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్లో సరికొత్తగా హల్చల్ చేస్తోన్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే పేజీ కేవలం ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో కోటికి పైగా (10 మిలియన్లు) ఫాలోవర్లను సంపాదించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారిక ఖాతాల కంటే అత్యంత వేగంగా ఈ పేజీ ఫాలోవర్లను పెంచుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా నేటి తరం యువత (జెన్ జీ – Gen Z) సత్తా ఏంటో ఈ ట్రెండ్ నిరూపిస్తోందని సోషల్ మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు.
Cockroach Janata Party | ట్విట్టర్ ఖాతా బ్లాక్..
ఇన్స్టాగ్రామ్లో గంటగంటకూ ఫాలోవర్లు పెరుగుతున్న తరుణంలోనే, అటు ఎక్స్ (ట్విట్టర్) లోనూ ఈ పార్టీ పేజీకి ఆదరణ పెరిగింది. అయితే, అనూహ్యంగా ఆ ట్విట్టర్ ఖాతా పూర్తిగా బ్లాక్ అవ్వడం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. ఈ క్రేజ్ చూసి భయపడే అధికార బీజేపీ పార్టీయే తమ ట్విట్టర్ పేజీని డిలీట్ చేయించిందని సదరు పేజీ క్రియేటర్లు ఆరోపిస్తున్నారు. తమ ఎదుగుదలను తట్టుకోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని వారు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
Cockroach Janata Party | పాకిస్థాన్కూ పాకిన ‘కాక్రోచ్’ ట్రెండ్..
ఈ సరికొత్త సోషల్ మీడియా ట్రెండ్ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. పొరుగుదేశమైన పాకిస్థాన్కూ(Pakistan) ఇది విస్తరించింది. భారత ‘కాక్రోచ్ జనతా పార్టీ’ స్ఫూర్తితో అక్కడ ‘కాక్రోచ్ అవామీ పార్టీ’, ‘కాక్రోచ్ అవామీ లీగ్’ వంటి సరికొత్త పేజీలు, గ్రూపులు పుట్టుకొచ్చాయి.
గత కొంతకాలంగా పాకిస్థాన్లో తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం నడుస్తున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడం, సరైన పాలన లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాల తీరుపై డిజిటల్ రూపంలో నిరసన తెలపడానికి లేదా వ్యంగ్యంగా స్పందించడానికి అక్కడి యువత కూడా ఈ సరికొత్త ‘కాక్రోచ్’ ట్రెండ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం.
ఇది కూడా చదవండి: Tiger Attack Chandrapur | తునికాకు కోసం వెళ్లి.. పులి దాడిలో నలుగురు మహిళల మృతి


