అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Fraud | దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మాయమాటలు చెప్పి సైబర్ దొంగల ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. పలువురు బ్యాంక్ ఉద్యోగులు సైతం సైబర్ మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం.
తెలంగాణలో సైబర్ మోసాల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ఆక్టోపస్ 2.0 పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను ఛేదించారు. మొత్తం 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, బ్యాంకు అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు.
Cyber Fraud | అండగా నిలుస్తున్న బ్యాంక్ సిబ్బంది
ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించాల్సిన బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు సైబర్ దొంగలతో చేతులు కలిపారు. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు (Trading Fraud), డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 32 మంది బ్యాంకు అధికారులు ఉండగా.. 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంకు అధికారులు అక్రమంగా బ్యాంకు ఖాతాలు (మ్యూల్ అకౌంట్స్) తెరిచి ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Cyber Fraud | 16 బృందాలతో..
ఆపరేషన్ వివరాలను ఆదివారం సీపీ సజ్జనార్ (CP Sajjanar) వెల్లడించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయని ఆయన చెప్పారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారని చెప్పారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందన్నారు. వీటి ద్వారా రూ.150 కోట్ల మేర మోసాలు జరిగినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : Rythu Bharosa | రైతులకు గుడ్న్యూస్.. 20న రెండో విడత రైతుభరోసా

