అక్షరటుడే, వెబ్డెస్క్: Election Polling | దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి దశలో భాగంగా 152 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 7.04 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ దశలో సుమారు 3,60,77,310 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Election Polling | రెండు చోట్లు ఎలక్షన్స్..
తమిళనాడులో (Tamilnadu) ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరి కోసం 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల్లోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, పరిస్థితిని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఎన్నికల ఫలితాలు (Election Results) మే 4న వెలువడనున్నాయి. ఇరు రాష్ట్రాల్లో అధికారంలో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఈ ఓటు హక్కును సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఉపయోగించుకుంటున్నారు. షూటింగ్లతో బిజీగా ఉన్న కొందరు స్టార్స్ నిన్న రాత్రే తమ ప్రాంతాలకి చేరుకొని ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ సారి తమిళనాడులో స్టార్ హీరో విజయ్ రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికకరంగా మారింది. ఈ సారి అందరి దృష్టి తమిళనాడు ఎన్నికలపైనే ఉంది.
Election Polling | కుటుంబ సభ్యులతో
ఈ రోజు ఉదయం 9 గంటల వరకు సుమారు 17.69 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయాన్నే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్ (M. K. Stalin) చెన్నైలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) కూడా చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.
ఇక సినీ నటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ (Kamal Haasan) తన కుమార్తె శృతి హాసన్తో కలిసి చెన్నైలో ఓటు వేశారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) చెన్నైలోని స్టెల్లా మేరిస్ స్కూల్ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్నా డీఎంకే చీఫ్ పళని స్వామి సాలెం ప్రాంతంలో ఓటు వేశారు.
ఇది కూడా చదవండి..: Assembly election polling | తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

