భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్గా గుర్తింపు పొందిన ఈమోటరాడ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో సరికొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. కుప్పం గ్రీన్ సిటీ ఇనిషియేటివ్లో భాగంగా చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం కంపెనీకి 7 ఎకరాల భూమిని కేటాయించారు. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని సామాన్యులకు సైతం మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈమోటరాడ్ ఈ కీలక అడుగు వేసింది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అంటే కాడాతో కలిసి అమలు చేస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ , కాడా ఆధ్వర్యంలో సాగుతున్న సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో ఇది ఒక భాగం. ఈ నూతన తయారీ కేంద్రం ద్వారా పర్యావరణహిత రవాణా విస్తరించడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఈ సందర్భంగా ఈమోటరాడ్ సహ వ్యవస్థాపకుడు , సీఈఓ కునాల్ గుప్తా మాట్లాడుతూ కుప్పం తమ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన ప్రదేశమని కొనియాడారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇక్కడే తాము ఒక ప్రపంచ రికార్డు سృష్టించామని ఆ అనుభవమే తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని చెప్పారు. కేవలం వ్యాపారం కోసమే కాకుండా ఈ నగరంతో ఒక దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పరచుకోవాలనే నిశ్చయంతోనే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇది స్థానిక ప్రజలకు ఉద్యోగాలను మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు దేశ స్వచ్ఛమైన మొబిలిటీ భవిష్యత్తులో భాగస్వామ్యం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ గ్రీన్ సిటీ ఇనిషియేటివ్కు అద్భుతమైన నాయకత్వం వహించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఈమోటరాడ్ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనుంది. దీనివల్ల కుప్పం ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్ , దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సరసమైన ధరలకే ఎలక్ట్రిక్ సైకిళ్లు అందుబాటులోకి వస్తాయి. పరిశుభ్రమైన , స్మార్ట్ పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న గ్రీన్ సిటీ ఇనిషియేటివ్లో హరిత రవాణా స్వదేశీ తయారీ , ఉపాధి కల్పన అనే మూడు అంశాలు ఒకే చోట సమన్వయం అవుతున్నాయి. ఇలాంటి ఒక సమగ్ర ఈవీ ప్రాజెక్టు దేశంలోనే మొదటి ప్రయత్నంగా నిలుస్తోంది.
ప్రయాణికులు విద్యార్థులు ఫిట్నెస్ అభిరుచి గలవారు , అడ్వెంచర్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా సైకిళ్లను రూపొందించే ఈమోటరాడ్ ఈ కేంద్రం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ మొబిలిటీ తయారీ కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక గ్రీన్ సిటీ ఇనిషియేటివ్లో భాగస్వాములుగా ఎంపికైన మదర్ డెయిరీ అడిడాస్ , ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన హిండాల్కో వంటి దిగ్గజ సంస్థల సరసన ఇప్పుడు ఈమోటరాడ్ కూడా చేరింది. ఇది కుప్పం ప్రాంతాన్ని సుస్థిర అభివృద్ధికి ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేలా దోహదపడుతుంది.