Konda Surekha letter | కడియం శ్రీహరి ఏ పార్టీ అమ్మా?.. రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై నెట్టింట పేలుతున్న సెటైర్లు!

ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రమశిక్షణా కమిటీ ఎలా చర్యలు తీసుకుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Konda Surekha letter | తెలంగాణ Telangana రాజకీయాల్లో లేఖల పర్వం కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాసిన ఒక అధికారిక లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది.

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన శాఖకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి ఈ లేఖ రాశారు. అయితే, ఈ లేఖలో ఆమె కోరిన ఒకే ఒక్క డిమాండ్ ఇప్పుడు నెటిజన్లకు పెద్ద హాస్య వస్తువుగా మారింది.

Konda Surekha letter | లేఖలో అసలు ట్విస్ట్ ఏంటంటే?

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాసిన లేఖలో.. కడియం శ్రీహరి వ్యవహారంపై “పార్టీ క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ స్థాయిలో విచారణ జరిపించాలని, పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని” వినయపూర్వకంగా కోరారు.

ఇక్కడే అసలు కథ మొదలైంది! నెటిజన్లు అడుగుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఒక్కటే.. “అసలు కడియం శ్రీహరి ఏ పార్టీ అమ్మా?”

Konda Surekha letter | నెటిజన్ల నవ్వుల వెనుక అసలు కథ

రాజకీయంగా ఇటు అటు కాకుండా ఉన్న కడియం శ్రీహరి ప్రస్తుత పరిస్థితిని గుర్తుచేస్తూ నెటిజన్లు రకరకాల సెటైర్లు విసురుతున్నారు.

Pritam Pedro Review | హైటెక్ హ్యాకర్.. పాతకాలపు పోలీస్.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘జనరేషన్ గ్యాప్’ : ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ ఎలా ఉందంటే?

గెలిచింది కారు గుర్తుపై.. కాపురం హస్తంతో!

కడియం శ్రీహరి గత అసెంబ్లీ ఎన్నికల్లో భారాస (BRS) తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొన్నప్పటికీ.. టెక్నికల్‌గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరినట్లు ధ్రువీకరిస్తే.. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యే పదవి ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆయన అటు భారాసకు పూర్తిగా దూరం కాలేక, ఇటు కాంగ్రెస్‌లో అధికారికంగా విలీనం కాలేక ‘త్రిశంకు స్వర్గం’ లో ఉన్నారు.

Konda Surekha

Konda Surekha letter | రేవంత్ రెడ్డి చర్యలు ఎలా తీసుకుంటారు?

టెక్నికల్‌గా కడియం శ్రీహరి ఇంకా భారాస ఎమ్మెల్యేనే అయినప్పుడు, ఆయనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన క్రమశిక్షణా కమిటీ ఎలా చర్యలు తీసుకుంటుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సింది భారాస అధినేత కేసీఆర్.. కానీ, కొండా సురేఖ మాత్రం లేఖను రేవంత్ రెడ్డికి రాశారు.. ఇదేం లాజిక్ సురేఖ గారు?” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Konda Surekha letter | అఫీషియల్‌గా ఒప్పుకొన్నట్లేనా?

మంత్రి తన లేఖలో ‘పార్టీ క్రమశిక్షణా కమిటీ’ అని ప్రస్తావించడం ద్వారా.. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ మనిషేనని అధికారికంగా ఒప్పుకున్నట్లా? మరి అలా అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదా? అని కొందరు నెటిజన్లు చట్టపరమైన చిక్కులను కూడా లేవనెత్తుతున్నారు.

మొత్తానికి, ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందన్న ఆవేశంలో మంత్రి కొండా సురేఖ రాసిన ఈ లేఖ.. కడియం శ్రీహరి రాజకీయ అస్తిత్వాన్ని, కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న ‘సస్పెన్స్’ స్థానాన్ని రోడ్డున పడేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

“తొందరపడి ఒక కోయిల ముందే కూసింది” అన్నట్లు.. మంత్రి లేఖ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *