అక్షరటుడే, వెబ్డెస్క్: FCRA Bills | తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీలో నీట్, ఎఫ్సీఆర్ఏ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ, పేద విద్యార్థులకు నీట్ ప్రతికూలంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఖరీదైన కోచింగ్ వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల కోసం ఉన్న నీట్ను రద్దు చేయడానికి, కేంద్ర చట్టాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని శాసనసభ కోరనుంది. అధిక రుసుములు వసూలు చేస్తూ, నియంత్రణ లేని కోచింగ్ సెంటర్లు పెరిగిపోతున్నాయని, ఇవి విద్యార్థులను పాఠశాల పాఠ్యాంశాలను పక్కనపెట్టి, ప్రధానంగా నీట్ ప్రిపరేషన్పైనే దృష్టి పెట్టేలా చేస్తున్నాయని పేర్కొంది. నీట్ (NEET) నుండి తమిళనాడుకు మినహాయింపు కోరుతూ ప్రవేశపెట్టిన 2021 నాటి బిల్లు నెం. 43ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని గుర్తు చేసింది.
FCRA Bills | ఆ బిల్లుపై సైతం..
ఎఫ్సీఆర్ఏ బిల్లును సైతం తమిళనాడు శాసనశాభ వ్యతిరేకించింది. బిల్లును ప్రస్తుత రూపంలో ఉపసంహరించుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద, మత, విద్యా, వైద్య, సామాజిక సంస్థలతో సహా ఇతర భాగస్వాములతో సమగ్ర సంప్రదింపులు జరపాలని కోరింది. ఏవైనా సవరణలు చేసేటప్పుడు, విదేశీ విరాళాల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూనే, సహజ న్యాయం, అనుపాత సూత్రం, ఆస్తి హక్కులు, చట్టబద్ధమైన ఆకాంక్ష మరియు సమాఖ్యవాదానికి రక్షణ కల్పించాలని ఇది సూచిస్తోంది.
ఇది కూడా చదవండి..: delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు