అక్షరటుడే, గాంధారి: Gandhari School Buildings | గాంధారి మండలం (Gandhari Mandal)లోని పలు పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే బడులను బాగు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఈ శిథిలబడుల్లో విద్యనభ్యసిస్తున్నారు.
Gandhari School Buildings | మండల కేంద్రంలో..
మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలు తీవ్ర శిథిలావస్థకు చేరాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇక్కడ దాదాపు 500 నుండి 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ప్రారంభమైనా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తరగతుల నిర్వహణ కష్టంగా మారింది.
Gandhari School Buildings | గోడల మధ్య చెట్లు..
పాఠశాల గోడల మధ్య చెట్ల వేర్లు లోపలికి చొచ్చుకువచ్చినా, ఆర్అండ్బీ అధికారులు మాత్రం గోడలు దృఢంగా ఉన్నాయని, కేవలం ప్లాస్టరింగ్ చేస్తే సరిపోతుందని నివేదిక ఇవ్వడంపై విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెచ్చులు పడకుండా చేసిన పీఓపీ పనులు కూడా వృథా అయ్యాయని వారంటున్నారు.
Gandhari School Buildings | జీతం ఇక్కడే.. డ్యూటీ ఇంకెక్కడో!

పాఠశాలకు పీఈటీ లేకపోవడంతో విద్యార్థుల క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యం దెబ్బతింటోంది. ఇక్కడ పోస్టింగ్ ఉన్న పీఈటీ ప్రస్తుతం డిప్యూటేషన్పై వేరే చోట విధులు నిర్వహిస్తూ, జీతం మాత్రం ఇక్కడే పొందుతున్నారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో నష్టపోతున్నారు. ప్రధాన రహదారి పక్కనే స్కూల్ ఉండటంతో, పీఈటీ లేక విద్యార్థులు రోడ్డుపైకి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Gandhari School Buildings | మండలంలోని ఇతర పాఠశాలలు..

మండలంలోని రాంపూర్ గడ్డ ప్రైమరీ స్కూల్ (Rampur Gadda Primary School) భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి కూల్చివేతకు (డిస్మింటల్) సిద్ధంగా ఉంది. అలాగే చిన్న పోతంగల్ ప్రైమరీ స్కూల్లో ఒక తరగతి గది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పెట్ సంఘం హైస్కూల్లోఒక తరగతి గది ప్రమాదకరంగా మారడంతో వాడకూడదని ఆర్అండ్బీ అధికారులు సూచించారు. దీంతో ఆ గదిని నిరుపయోగంగా వదిలేశారు. అయితే శిథిలావస్థకు చేరిన గదులను పూర్తిగా కూల్చివేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని.. లేకపోతే వాటి పరిసరాల్లోకి వెళ్లే విద్యార్థులకు ప్రమాదం పొంచిఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎంఈవో శ్రీహరి మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన పాఠశాలల కూల్చివేత, నిర్మాణ అంశాలు ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు.
Gandhari School Buildings | ఆర్అండ్బీ నివేదికపై ఆగ్రహం
మండలంలోని స్కూళ్లలో కొన్ని తరగతి గదులు కనీసం స్టోర్ రూమ్గా కూడా వాడటానికి వీల్లేనంతగా పెచ్చులూడి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అయితే మరోవైపు కొత్తగా నిర్మించిన భవనాలకు ప్లాస్టరింగ్ పూర్తి కాకపోవడంతో అలాగే అరకొర వసతులతో తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్అండ్బీ అధికారుల నివేదిక మాత్రం విచిత్రంగా ఉంది. సదరు పాఠశాలల్లో పెచ్చులూడిపోయిన గదులకు ప్లాస్టిరంగ్ వేస్తే సరిపోతుందని పేర్కొనడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Mallupet Road Accident | జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు..