అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao Letter Section 22A | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో సెక్షన్ 22A (నిషేధిత భూముల జాబితా) దుర్వినియోగం, విపరీతమైన అవినీతి ఆరోపణలను లేవనెత్తుతూ కాంగ్రెస్ జాతీయ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తానీరు హరీశ్ రావు ఘాటైన బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ పరిపాలనలో తలెత్తిన సంక్షోభాన్ని, ప్రైవేటు ఆస్తులపై పెరిగిన వేధింపులను సూటిగా ప్రశ్నించిన ఈ లేఖ, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర తుపాను రేపుతోంది.
Harish Rao Letter Section 22A | పొంగులేటి బర్తరఫ్ డిమాండ్
రెవెన్యూ శాఖలో తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
సర్కారు ఆస్తులను కాపాడటానికి ఉపయోగించాల్సిన చట్టపరమైన నిబంధనలను, నిధుల సేకరణకు, ప్రైవేటు ఆస్తుల యజమానులను భయపెట్టే సాధనంగా మార్చుకున్నారని ఆరోపించారు.
Harish Rao Letter Section 22A | ఆర్టిఫిషియల్ డిస్ప్యూట్స్.. 30% వసూళ్ల కమీషన్ల దందా
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వంటి రియల్ ఎస్టేట్ హాట్స్పాట్లలో HMDA – ULC అనుమతులున్న ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలోకి నెట్టేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
నిషేధిత జాబితా నుంచి పేర్లను తొలగించడానికి భూముల మార్కెట్ విలువలో ఏకంగా 30% కమీషన్ వసూలు చేసే దళారీ వ్యవస్థ నడుస్తోందని తీవ్ర ఆరోపణ చేశారు.
50:50 జాయింట్ డెవలప్మెంట్ ఒత్తిడి: అవుటర్ రింగ్ రోడ్ (ORR) పరిసరాల్లో ఉన్న విలువైన భూములను 22Aలో పెట్టి, రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలకు 50:50 అగ్రిమెంట్ల ప్రాతిపదికన డెవలప్మెంట్కు ఇవ్వాలని యజమానులను బెదిరిస్తున్నారని లేఖలో రాసుకొచ్చారు.
Harish Rao Letter Section 22A | సొంత కేబినెట్ మంత్రుల వ్యాఖ్యలు..సీఎం మౌనం
యాదాద్రి జిల్లాలోనే సుమారు 40 వేల ఎకరాలను 22A జాబితాలో చేర్చారంటూ నాలుగు నెలల క్రితమే కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయాన్ని హరీశ్ రావు గుర్తుచేశారు.
ఒక మంత్రి బహిరంగంగా అంగీకరించినా ముఖ్యమంత్రి రేవంత్ మౌనంగా ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి, పరోక్ష అంగీకారానికి నిదర్శనమని వర్ణించారు.
Harish Rao Letter Section 22A | హరీశ్ ప్రధాన డిమాండ్లు
ఈ నిశ్శబ్ద దోపిడీని నిరోధించేందుకు హరీశ్ రావు ప్రభుత్వం ముందుకు పలు ప్రతిపాదనలు ఉంచారు.
హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ: 2023 డిసెంబరు నుంచి నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి ఆస్తిపైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిచే స్వతంత్ర విచారణ జరిపించాలి.
ఫోరెన్సిక్ ఆడిట్: ఏ ఆస్తిని ఎవరి ఆదేశాలతో చేర్చారో, తీసేశారో తేల్చడానికి బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.
పబ్లిక్ డొమైన్లో 22A జాబితా: జిల్లాల వారీగా 22A జాబితాను ఆన్లైన్ పబ్లిక్ డొమైన్లో ఉంచి పారదర్శకతను నిరూపించుకోవాలి.
Harish Rao Letter Section 22A | రాహుల్ గాంధీకి హెచ్చరిక
ఎన్నికల సమయంలో ‘భూమాత’ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చాక ప్రజల ఇళ్లను లాక్కునే రాబందులా మారాయని విమర్శించారు.
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఈ అంశంపై వెంటనే జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే, అవినీతి మంత్రిని కాపాడుకునేందుకు ప్రజల విశ్వాసాన్ని పణంగా పెట్టినట్లవుతుందని, దీనికి కాంగ్రెస్ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ ఆరోపణలు అబద్ధమైతే తక్షణమే స్వతంత్ర విచారణకు ఆదేశించి రేవంత్ సర్కారు తన నిజాయితీని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటాన్ని ఆపదని హరీశ్ రావు తేల్చిచెప్పారు.