అక్షరటుడే, వెబ్డెస్క్: Hormuz Strait Closure | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త చల్లబడ్డాయి. అయినా కూడా హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఉత్కంఠ వీడటం లేదు. ఇటీవల ఈ మార్గాన్ని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్భందించంతో జలమార్గాన్ని మళ్లీ ఇరాన్ మూసి వేసింది.
ఇరాన్ (Iran) ఓడరేవులపై అమెరికా (America) దిగ్బంధాన్ని ఎత్తేయాలని ఐఆర్జీసీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు హర్మూజ్ను మూసే ఉంచుతామని స్పష్టం చేసింది. యుద్ధ విరమణ షరతులను అమెరికా ఉల్లంఘించిందని మండిపడింది. అమెరికా చర్యల వల్లే హర్మూజ్ను మళ్లీ మూసివేశామని తెలిపిరు. హర్మూజ్ ద్వారా ఏ నౌక కదలకూడదని పేర్కొంది. తమ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగితే, ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గాలలో ఒకటైన దీని ద్వారా జరిగే ప్రపంచ నౌకా రవాణాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ట్రంప్ (Trump) చర్యను ఇరాన్ అధికారులు “మూర్ఖపు, అజ్ఞానపు నిర్ణయం” అని తీవ్రంగా విమర్శించారు.

Hormuz Strait Closure | అమెరికా తీరుతో..
ఇరాన్, అమెరికా మధ్య సీజ్ఫైర్ (Ceasefire) కుదిరింది. అనంతరం లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. దీంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ముడిచమురు ధరలు భారీగా పడిపోయాయి. అయితే మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఓడరేవులపై దిగ్భందనం కొనసాగిస్తామన్నారు. దీంతో టెహ్రాన్ మళ్లీ హర్ముజ్ను మూసివేసింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడనుంది.
Hormuz Strait Closure | భారత నౌకలపై కాల్పులు
హర్ముజ్ జలసంధిలో శనివారం రెండు భారత నౌకలపై కాల్పులు జరిగాయి. జలసంధిని దాటుతున్న నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఇటీవల అనేక షిప్లు జలమార్గం మీదుగా ప్రయాణించి భారత్కు చేరుకున్నాయి. అయితే తాజాగా దాడి జరగడం గమనార్హం. ముడి చమురుతో వస్తున్న సన్మార్ హెరాల్డ్, బల్క్ క్యారియర్ అయిన జగ్ అర్నవ్ నౌకలపై IRGCకి చెందిన పడవలు కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం ఆ నౌకలు వెనుదిరిగాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.కాల్పుల ఘటనపై భారత్ స్పందించింది. శనివారం సాయంత్రం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశం కోసం ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించారు. హర్ముజ్ జలసంధిలో భారత జెండా నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి తెలియజేశారు. టెహ్రాన్ (Tehran)లోని అధికారులకు భారతదేశ ఆందోళనలను తెలియజేస్తానని ఫతాలీ హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Stock Market | బుల్ దూకుడు.. భారీగా పెరిగిన సూచీలు

