Iran US Peace Deal | ఇరాన్​తో యుద్ధం ముగిసింది.. ట్రంప్​ సంచలన ప్రకటన

ఇరాన్‌పై దాడులు విరమించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు పూర్తయ్యాయని తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran US Peace Deal | ఇరాన్‌పై దాడులు విరమించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు పూర్తయ్యాయని, పీస్ డీల్‌కు పలు దేశాలు ఆమోదం తెలిపాయని వెల్లడించారు.

ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తగ్గారు. గురువారం రాత్రి పెద్ద ఎత్తున దాడులు చేస్తామని, భవిష్యత్​లో ఖర్గ్​ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్​ సోషల్​ మీడియాలో పోస్ట్​లో పేర్కొన్న విషయం తెలిసిందే. గతంలో సైతం ఇలాగే ట్రంప్​ బెదిరింపులకు పాల్పడి అర్ధరాత్రి కాల్పుల విరమణకు ఆమోదం తెలిపారు. తాజాగా మరోసారి దాడులు చేస్తామని హెచ్చరించి.. వెనక్కి తగ్గారు.

Iran US Peace Deal | త్వరలో సంతకాలు

ఇరాన్‌ (Iran)తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపుగా పూర్తయిందని ట్రంప్​ తెలిపారు. ఈ వారాంతంలోనే యూరప్‌లో దీనిపై సంతకాలు జరగవచ్చని పేర్కొన్నారు. ప్రతిపాదిత ఒప్పందంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని టెహ్రాన్ హెచ్చరించింది. గురువారం (యూఎస్​ కాలమానం ప్రకారం) ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్​ విలేకరులతో మాట్లాడుతూ, పత్రాలు తుది దశలో ఉన్నాయని, అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ సంతకాల కార్యక్రమానికి హాజరుకావచ్చని ట్రంప్ తెలిపారు.

Iran US Peace Deal | అణ్వాయుధాలపై..

చర్చలు పురోగమిస్తున్న తరుణంలో, తాను ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఈ రోజు మేము ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాం. మేము పట్టుబట్టినట్లుగా, వారు ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని అంగీకరించారు. మా ముఖ్య ఉద్దేశం అదే అని ట్రంప్ అన్నారు. అమెరికా దాడుల్లో ఇరాన్​ తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. దీంతో ఈ ఒప్పందం చేసుకోవడానికి వారు ముందుకు వచ్చారని ఆయన జోడించారు. ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు పూర్తయిన తర్వాత హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని ట్రంప్ చెప్పారు. అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. ఒప్పందంలోని చాలా భాగం ఖరారైనప్పటికీ, కీలక నిర్ణయాలు ఇంకా సమీక్షలో ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ చెప్పినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Oman Ship Attack | ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి: విశాఖకు చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ దుర్మరణం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *