అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Accident | కామారెడ్డి పట్టణంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం (Kamareddy Fire Accident) చోటుచేసుకుంది. పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద గల పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు, హోటల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. శనివారం రాత్రి ఎప్పటిలాగే చిరు వ్యాపారులు దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పక్కనున్న 18 షాపులకు వ్యాపించాయి. దాంతో మంటల వ్యాప్తి ఎక్కువైంది.
Kamareddy Fire Accident | మంటలు చెలరేగడంతో..
వేసవికాలం కావడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఒకదాని తర్వాత మరొక షాపులకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే షాపులు పూర్తిగా దగ్దమయ్యాయి. అయితే షాపుల పక్కన చెత్తకుప్పకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు షార్ట్ సర్క్యూట్ ఏదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ ఛైర్పర్సన్
అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని, అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందించేలా చూస్తామని ధైర్యం చెప్పారు. ఇందిరాచౌక్ వద్ద గత కొన్నేళ్లుగా చిరు వ్యాపారులు పూల దుకాణాలు, చిన్నపాటి హోటళ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రధాన కూడలి కూడా కావడంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూల ఆర్డర్ల కోసం పూల స్టాక్ తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదంతో చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారు. జీవనోపాధి కోల్పోవడంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Delhi Judge Suicide | న్యాయవ్యవస్థలో విషాదం.. జడ్జి సూసైడ్!

