Kamareddy murder case | ఒంటరి మహిళలే లక్ష్యంగా దారి దోపిడీ.. వృద్ధురాలి హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు!

Naresh Chandan
Kamareddy murder case

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy murder case | ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని హత్యకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను రాజంపేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి మీడియాకు భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ వివరాలు వెల్లడించారు.

సీఐ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన 83 ఏళ్ల వృద్ధ మహిళ సుశీల గత నెలలో కాచాపూర్ గ్రామంలోని తన కూతురు ఇంటికి వెళ్లింది. తిరిగి 29వ తేదీన స్వగ్రామానికి బయలుదేరింది. కానీ, ఇంటికి చేరలేదు. దీంతో ఈ నెల 1 న వృద్ధురాలి కొడుకు మల్లయ్య భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Kamareddy murder case | ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా

పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాజంపేట బస్టాండ్ వద్ద రాజాంపేటకు చెందిన మేడిని బసవయ్య, రాజంపేట మండలం షేర్ శంకర్ తండాకు చెందిన బుక్యా బూల అనే ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగుచూశాయి. నిందితులు ఇద్దరు కూడా మద్యం అలవాటుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దోపిడీ దొంగతనాలకు తెరలేపారు.

Kamareddy murder case | బలవంతంగా కల్లు తాగించి

రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గత నెల 29 న సాయంత్రం సమయంలో ఒక వృద్ధ మహిళను బుక్యా బూల గమనించింది. ఆమె చేతికి వెండి కడియాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో ఆమెను మాటల్లో పెట్టి కల్లు దుకాణానికి తీసుకెళ్లి బలవంతంగా కల్లు తాగించింది.

తర్వాత బుక్యా బూల బసవయ్యకు సమాచారం అందించింది. దీంతో అతను వృద్ధురాలిని తన పొలం వద్దకు తీసుకురమ్మని బూలకు సూచించాడు. పథకం ప్రకారం ఇద్దరూ కలిసి కల్లు మత్తులో ఉన్న ఆ వృద్ధ మహిళ చేతులపై ఉన్న వెండి కడియాలను తీసుకున్నారు.

మిగతా కడియాలను తీసే అవకాశం లేకపోవడంతో ఎవరైనా గమనిస్తారనే భయంతో మత్తులో ఉన్న వృద్ధురాలిని సమీపంలోని ఎండిపోయిన బావిలోకి నెట్టి హతమార్చారు. అనంతరం దోచుకున్న వెండి కడియాలను నిందితులు పొలంలో దాచిపెట్టారు.

తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆదివారం రాజంపేట బస్టాండ్ వద్ద పోలీసులకు చిక్కగా వారిని అరెస్టు చేసి నిందితుల వద్ద నుంచి వెండి కడియాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు.

Hyderabad SI transfers | సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *