అక్షరటుడే వెబ్డెస్క్: Mahindra Solar Project | మహీంద్రా గ్రూప్కు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్, ఆ గ్రూప్నకు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ ‘మహీంద్రా సస్టెన్’ సంయుక్తంగా పంజాబ్లో భారీ సోలార్ ప్రాజెక్ట్ను అందుబాటులోకి తెచ్చాయి. పంజాబ్లోని ( Punjab ) బఠిండాలో 42 మెగావాట్ల పీక్ (MWp) సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ గ్రూప్ కేప్టివ్ సోలార్ ప్రాజెక్ట్.. ఆ రాష్ట్రంలోనే ఇలాంటి అతిపెద్ద ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా స్వరాజ్ ట్రాక్టర్స్ తయారీ యూనిట్లకు అవసరమయ్యే విద్యుత్లో దాదాపు సగం (50%) అవసరాలు తీరనున్నాయి. మహీంద్రా గ్రూప్ హరిత ప్రయాణంలో భాగంగా తక్కువ కార్బన్ ఉద్గారాలతో కూడిన భవిష్యత్ తయారీ వ్యవస్థను రూపొందించడంలో ఈ ప్రాజెక్ట్ ఒక కీలక మైలురాయిగా మారనుంది.
Mahindra Solar Project | ప్రాజెక్ట్ విశేషాలు..
పంజాబ్ రాష్ట్రం బఠిండాలోని తల్వాండి సాబో పరిధిలోని టెయోనా పుజారియన్ గ్రామంలో సుమారు 141 ఎకరాల విస్తీర్ణంలో ఈ సోలార్ ప్లాంట్ను నిర్మించారు. మొహాలిలోని స్వరాజ్ ట్రాక్టర్స్ తయారీ, అసెంబ్లీ, అలాగే ఫౌండ్రీ యూనిట్లకు ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు. మిగిలిన మిగులు విద్యుత్ను పంజాబ్లోని ఇతర మహీంద్రా గ్రూప్ సంస్థల అవసరాలకు మళ్లిస్తారు. ఈ ప్లాంట్లో అత్యంత సామర్థ్యం గల ఎన్-టైప్ టాప్కాన్ (N-Type TOPCon) బైఫేషియల్ సోలార్ మోడ్యూల్స్ను అమర్చడం ద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూశారు.
Mahindra Solar Project | పర్యావరణ ప్రయోజనం..
ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా దాదాపు 61.54 మిలియన్ యూనిట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి కానుండగా.. ఏటా 42,000 టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలు తగ్గనున్నాయి. ఈ ప్రాజెక్ట్కు అవసరమైన పరికరాలలో దాదాపు 97 శాతానికి పైగా దేశీయంగానే సేకరించడం విశేషం. సోలార్ ప్యానెల్స్ను శుభ్రం చేసేందుకు సెమీ ఆటోమేటిక్ రోబోటిక్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఏడాదికి సుమారు 1.92 మిలియన్ లీటర్ల నీరు ఆదా అవుతుంది.
Mahindra Solar Project | సుస్థిరత దిశగా స్వరాజ్ ప్రయాణం..
ఈ సందర్భంగా స్వరాజ్ డివిజన్ సీఈఓ గగన్జోత్ సింగ్ మాట్లాడుతూ.. అర్ధ శతాబ్దం క్రితం స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రారంభమైన స్వరాజ్, నేడు సంప్రదాయ ఇంధన వనరులను తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధన వాడకాన్ని వేగవంతం చేస్తోందని తెలిపారు. ఇప్పటికే గోల్డెన్ పీకాక్ అవార్డు పొందిన స్వరాజ్ సంస్థ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు కీలక చర్యలు చేపడుతోందన్నారు.
మహీంద్రా సస్టెన్ ఎండీ, సీఈఓ అవినాష్ రావు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు విద్యుత్ సరఫరా రంగంలోకి తమ సంస్థ తొలిసారిగా అడుగుపెట్టిందని తెలిపారు. కాగా, స్వరాజ్ సంస్థకు చెందిన అన్ని తయారీ ప్లాంట్లు ఇప్పటికే ‘జీరో వేస్ట్ టు ల్యాండ్ఫిల్’ వాటర్ పాజిటివ్ హోదాలను కలిగి ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి: Bigala Ganesh Gupta | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచింది : మాజీ ఎమ్మెల్యే బిగాల