అక్షరటుడే వెబ్డెస్క్: Meta Child Safety | మెటా (Meta) ఆధీనంలోని ఇన్స్టాగ్రామ్.. 13 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో ‘డోంట్ ఆస్క్.. డోంట్ టెల్’ (అడగొద్దు.. చెప్పొద్దు) అనే ప్రమాదకరమైన పాలసీని అనుసరించిందని ఆ సంస్థ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టరో బెజెర్ కోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. మెటాపై రెండో రోజు జరిగిన విచారణలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Meta Child Safety | లాభాల కోసం ..
కొత్త టూల్స్ తయారీలో భద్రతను పట్టించుకోకుండా.. మెటా నిలకడగా లాభాలపైనే దృష్టి పెట్టిందని బెజెర్ కోర్టుకు తెలిపారు. ప్రజలు ఎంత అధిక సమయం తమ యాప్స్లో గడుపుతారు అనే అంశానికే ప్రాధాన్యమిచ్చిందని వివరించారు. ఇన్స్టాగ్రామ్ ( Instagram )వాడే 13 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో ‘డోంట్ ఆస్క్.. డోంట్ టెల్’ పాలసీని అమలు చేశారన్నారు. అంటే.. ఈ వయసు పిల్లలు ఇన్స్టా వాడుతున్నట్లు తెలిసినా యాప్ అడగదు.. పిల్లలు కూడా చెప్పకపోతే చాలు అన్న వైఖరిని ప్రదర్శించారని తెలిపారు. 13 ఏళ్లలోపు పిల్లలు భారీ సంఖ్యలో ఇన్స్టా వాడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. ఫేక్ ఖాతాలను గుర్తించే శక్తిమంతమైన టూల్స్ మెటా వద్ద ఉన్నప్పటికీ, పిల్లల వయసును గుర్తించడానికి సరైన ప్రమాణాలను మాత్రం ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. కాగా.. ఈ ఆరోపణలను మెటా తోసిపుచ్చింది.
ఇక జీతాల పెంపు, ప్రమోషన్ల వేళ ఉద్యోగుల పనితీరు విశ్లేషణ కూడా యూజర్ నెంబర్ల ఆధారంగానే ఉండేదని బెజెర్ వెల్లడించారు. ఆర్టరో బెజెర్ ఫేస్బుక్లో 2009-2015 వరకు పనిచేశారు. సైబర్ వేధింపులపై పోరాటంలో ఆయన పేరు బాగా పాపులర్ అయింది. 2019-2021 వరకు మెటా యాప్స్ సేఫ్టీ ఇష్యూస్పై కాంట్రాక్టర్గా విధులు నిర్వర్తించారు. 2009 నుంచి సంస్థతో ఉన్న అనుభవంతో, 2023 నాటి అమెరికా కాంగ్రెస్ విచారణలోనూ మెటాపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ యాప్స్ వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయన్న విషయం కంపెనీ సీఈవో జుకర్బర్గ్కు ముందే తెలుసని నాడు ఆయన పేర్కొన్నారు.
Meta Child Safety | రూ.19 లక్షల కోట్ల పరిహారం..
అమెరికాలో 29 రాష్ట్రాలు ఉమ్మడిగా మెటాపై ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో భారీ దావా వేశాయి. తమ సోషల్ మీడియా యాప్లకు పిల్లలు, టీనేజర్లు బానిసలయ్యేలా మెటా డిజైన్ చేసిందని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మేగన్ ఓనెయిల్ ఆరోపించారు. యువతను యాప్లకు అడిక్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా భారీగా లబ్ది పొందడమే ఆ సంస్థ బిజినెస్ మోడల్ అని వాదించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ కేసులో మెటా కనీసం రూ.19 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ravi Kumar Diwakar | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష వేసిన జడ్జి.. తర్వాత ఏం జరిగిందంటే?