అక్షరటుడే వెబ్డెస్క్: Meta Notice | ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi )వీడియో సందేశాన్ని ఫేస్బుక్ కొంత సమయం పాటు తొలగించిన ఘటనపై ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. బుధవారం అత్యున్నత స్థాయి ప్రతినిధులతో కలిసి చర్చలకు రావాలని మెటా పబ్లిక్ పాలసీ హెడ్ జో కాప్లన్ను ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కోరింది. ఆయనతో పాటు ఇన్స్టాగ్రామ్ సాంకేతిక అధికారులను కూడా హాజరుకావాలని ఆదేశించింది.
Meta Notice | అల్గారిథమ్పై ప్రభుత్వ ఆరా..
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకు అనూహ్యంగా ఎక్కువ ఆదరణ లభిస్తోందని ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే మెటా అల్గారిథమ్ ఏవిధంగా పనిచేస్తుందనే అంశంపై ప్రభుత్వం ఆరా తీయనుంది. అంతేకాకుండా, ప్రధాని మోదీ వీడియో తొలగింపునకు కారణమైన సాంకేతిక లోపంపై లిఖితపూర్వక వివరణ కోరే అవకాశాలున్నట్లు సమాచారం. గూగుల్, ఎక్స్, స్నాప్చాట్ వంటి ఇతర సంస్థలకు కూడా పార్లమెంటరీ స్థాయీసంఘం నోటీసులు జారీ చేసింది.
Meta Notice |ఏం జరిగిందంటే?
విద్యార్థుల ఉద్యమంపై ఇటీవల ప్రధాని మోదీ విడుదల చేసిన తొలి వీడియోను ఫేస్బుక్ తొలగించగా, బీజేపీ కార్యకర్త ప్రీతి గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని సెల్ఫీ వీడియోను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన మెటా.. ఆటోమేటిక్ ఫిల్టరింగ్ సిస్టమ్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. అయితే, మెటా ఇచ్చిన సమాధానంతో ప్రభుత్వం సంతృప్తి చెందకపోవడంతో తాజాగా మరోసారి ఉన్నతాధికారులను చర్చలకు ఆహ్వానించింది. ప్రముఖుల ఖాతాలపై ఇకపై అదనపు పర్యవేక్షణ ఉంటుందని గత సమావేశంలో మెటా బృందం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: Rice Mill Action | నిబంధనలు ఉల్లంఘించిన రైస్మిల్లులపై చర్యలు తప్పవు: సీపీ సాయిచైతన్య