అక్షరటుడే, భీమ్గల్: Mupkal Bus Stand | బాల్కొండ నియోజకవర్గం (Balkonda Constituency)లోని ముప్కాల్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం విషయమై గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో కనీసం బస్టాండ్ షెడ్ లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఎండలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని, ప్రభుత్వ స్థలంలో గ్రామస్థులంతా కలిసి బస్టాండ్ ఏర్పాటుకు పూనుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mupkal Bus Stand | రోడ్డుపై బైఠాయింపు..
కొందరు ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం బస్టాండ్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, వారికి పోలీసులు సహకరించడం సరికాదని నిరసిస్తూ గ్రామస్థులు పెద్దఎత్తున రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న బాల్కొండ సీఐ జాన్ రెడ్డి (CI John Reddy) భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రామస్థులతో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. ‘ప్రభుత్వం కట్టించకపోయినా, ప్రయాణికుల సౌకర్యం కోసం మా సొంత నిధులతో షెడ్ వేసుకుంటుంటే అడ్డుకోవడం ఎందుకు?’ అని గ్రామస్థులు పోలీసులను నిలదీశారు.
Mupkal Bus Stand | రేకుల షెడ్డు నిర్మాణం..
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గ్రామస్థులంతా మూకుమ్మడిగా తరలివచ్చి, యుద్ధప్రతిపాదికన రేకుల షెడ్డుతో బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఈ బస్టాండ్ను ఎవరైనా తొలగించాలని చూస్తే ఊరుకునేది లేదని, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామస్థులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Kakatiya SSC Results | ర్యాంకుల రేసులో కాకతీయ టాప్.. విజయ రహస్యాలు పంచుకున్న విద్యార్థులు!

