Paddy Procurement | దొడ్డురకం ధాన్యం సేకరణలో ఇబ్బందుల్లేకుండా చూడాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Paddy Procurement | దొడ్డురకం ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఇందల్వాయి మండలం చంద్రాయణపల్లి, గన్నారంలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.

Paddy Procurement | ధాన్యం తీరుతెన్నుల పరిశీలన..

కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్​ పరిశీలించారు. రైతులను పలుకరించి, ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా.. ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు (Farmers) వేచిచూడాల్సిన పరిస్థితి తలెత్తకూడదన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం జరిపించి, వెనువెంటనే నిర్దేశిత రైస్​మిల్లులకు పంపించాలని అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా రవాణాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం చేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరిగితే, అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ ప్రక్రియలో అలసత్వానికి తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు.

Paddy Procurement | సన్నరకంతో పాటు దొడ్డురకం..

సన్నరకంతో పాటు దొడ్డు రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, దొడ్డు రకం సేకరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్​ సూచించారు. రైతులు ఏ దశలోనూ ఇబ్బందులకు గురి కాకుండా చూడాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో షామియానాలు, తాగునీరు వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలన్నారు. తద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని చెప్పారు.

ధాన్యం సేకరణలో గన్నీ బ్యాగులు వంటి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని పేర్కొన్నారు. నిర్ణీత ప్రమాణాలకు లోబడి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డీఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్స్​​ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, డీఏవో వీరస్వామి, ఏఎస్​వో అరవింద్ రెడ్డి, ఎంపీడీవో అనంత్ రావు తదితరులున్నారు.

ఇది కూడా చదవండి..: Pressure Cooker Blast | కుక్కర్ పేలి మహిళకు గాయాలు.. కామారెడ్డిలో ఘటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *