Riyan Parag Vaping | డ్రెస్సింగ్ రూమ్‌లో ద‌మ్ముకొట్టిన‌ రియాన్ పరాగ్..!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Riyan Parag Vaping | రియాన్ పరాగ్  మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కెప్టెన్‌గా కొనసాగుతున్న అతడు, ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఎల‌క్ట్రానిక్ సిగ‌రెట్ తాగుతున్న‌ట్టు) చేస్తున్న‌ట్టుగా కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మంగళవారం న్యూ చండీగఢ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఛేజింగ్‌లో కీలక దశలో 16 బంతుల్లో 29 పరుగులు చేసిన పరాగ్ ఔటైన కొద్దిసేపటికే బ్రాడ్‌కాస్ట్ కెమెరాలో అతడు వేపింగ్ చేస్తున్నట్లు కనిపించే దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో (Social Media) క్షణాల్లో వైరల్ కావడంతో, అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అతని ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Riyan Parag Vaping | క్ష‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు..

స్టేడియంలలో ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐ కఠినమైన మార్గదర్శకాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్ ప్రాంతాల్లో పొగాకు లేదా సంబంధిత ఉత్పత్తుల వినియోగంపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో పరాగ్ (Riyan Parag) చర్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే, క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఇప్పటికే ఈ సీజన్‌లో పరాగ్‌పై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు, ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 81 పరుగులే చేసి బ్యాటర్‌గా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో తాజా వివాదం అతని మీద మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

Riyan Parag Vaping | బీసీసీఐ జరిమానా..

కాగా.. ఈ మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. పంజాబ్‌పై (Punjab) 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇదిలా ఉంటే, ఇటీవలే డగౌట్‌లో మొబైల్ ఫోన్ వినియోగించినందుకు రాజస్థాన్ జట్టు మేనేజర్‌పై బీసీసీఐ జరిమానా విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరాగ్ వీడియోపై బీసీసీఐ ఎలా స్పందిస్తుంది? ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? అన్నదానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇది కూడా చదవండి..: IPL 2026 Playoff Race | రసవత్తరంగా మారిన ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు.. ప్లే ఆఫ్స్ కోసం ఎవరికెన్ని విజయాలు అవసరం?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *