అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC JAC talks | ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రులు సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ జరిగింది.
తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో మంత్రులు శ్రీధర్బాబు (Sridhar Babu), పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి భట్టి విక్రమార్క జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. కార్మికులు తమ 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఇందులో 29 డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పటికే ఓకే చెప్పగా.. మూడింటి విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై చర్చ జరిగింది.
RTC JAC talks | శంకర్గౌడ్ కుటుంబానికి సాయం
సమావేశం ప్రారంభంలో నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటనపై మంత్రులు, అధికారులు, జేఏసీ నాయకులు మౌనం పాటించి నివాళులర్పించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు, ఒక ఇందిరమ్మ ఇల్లు (Indiramma House), కుటుంబంలోని ఒక అర్హులైన సభ్యుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ ఆత్మహత్యను రాజకీయాలకు వాడుకోకుండా ఉండాలని, ఈ క్లిష్ట సమయంలో శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా నిలవాలని ఆయన ప్రతిపక్ష పార్టీలను కోరారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. కార్మికులు అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు.
RTC JAC talks | దానికి గ్రీన్ సిగ్నల్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కీలక చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు సమాచారం. కారుణ్య నియామకాలపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న ఈ నియామకాలను శాశ్వత విధానంలోకి మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలిసింది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ చర్చలు సఫలమైతే సమ్మె విరమణ దిశగా అడుగులు పడే అవకాశం ఉంది.
దీనిని కూడా చదవండి : Mallareddy daughter-in-law | బీజేపీ కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు

