అక్షరటుడే, కామారెడ్డి: SC ST Journalists Issues | ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు ఈనెల 28లోగా పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న డిమాండ్ చేశారు. లేకపోతే 29న హైదరాబాద్ (Hyderabad)లోని ఐఅండ్పీఆర్ కమిషనరేట్ను ముట్టడిస్తామన్నారు. గురువారం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
SC ST Journalists Issues | అక్రెడిటేషన్ల మంజూరులో..
అక్రెడిటేషన్ల మంజూరులో దళిత, గిరిజన జర్నలిస్టుల పట్ల వివక్ష కొనసాగుతోందని, అక్రెడిటేషన్ల కమిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు వెంటనే అక్రెడిటేషన్ల కార్డులు మంజూరు చేయాలని, 2024 వరకు ఉన్న కార్డుల గడువు ముగిసి ఇన్ని రోజులు అవుతున్నా కొత్తవి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వారి పిల్లలకు పాఠశాలలు, కళాశాలల్లో 100శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని, సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యం కల్పించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు దళిత, గిరిజన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని గంగన్న ఆరోపించారు. సమస్యలపై 28లోగా స్పందించకుంటే 29న మాసబ్ట్యాంక్లోని ఐ&పీఆర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఈ ఉద్యమానికి ప్రజాసంఘాలు, న్యాయవాదులు మద్దతివ్వాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెడ్డు సాయిలు, జిల్లా అధ్యక్షుడు కుంటొల్ల యాదయ్య, జాయింట్ సెక్రెటరీ పెరుమాళ్ళ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Voter List Revision | ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైంది..: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ