Singareni Coal Gasification| సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్‌కు కిషన్ రెడ్డితో భట్టి కీలక చర్చలు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Singareni Coal Gasification|దేశవ్యాప్తంగా బొగ్గు గ్యాసిఫికేషన్ (బొగ్గును గ్యాస్‌గా మార్చే ప్రక్రియ) రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అందుకోవడానికి సింగరేణి సంస్థ కూడా పూర్తి సిద్ధంగా ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) భవిష్యత్తు కార్యాచరణ, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, సాంకేతిక సహకారం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

Singareni Coal Gasification|ఆధునిక సాంకేతికత ..

కోల్ ఇండియా లిమిటెడ్ దేశంలో చేపడుతున్న గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల తరహాలోనే, సింగరేణి కూడా తన పరిధిలోని బొగ్గు వనరులను లేటెస్ట్ టెక్నాలజీతో మరింత సమర్థవంతంగా వాడుకోవాలని చూస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. సాంప్రదాయ పద్ధతుల్లో కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా, బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా అదనపు వాల్యూ క్రియేట్ చేయవచ్చని చెప్పారు. దీనివల్ల ఇంధన భద్రత పెరగడమే కాకుండా, పరిశ్రమలకు మేలు జరుగుతుందని, కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి పాలసీ సపోర్ట్, టెక్నికల్ గైడెన్స్ అందించాలని ఆయన కోరారు.

Singareni Coal Gasification|సింగరేణికి కొత్త బ్లాకుల కేటాయింపు..

దక్షిణ భారతదేశంలో విద్యుత్, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో సింగరేణి పాత్ర ఎంతో కీలకమని, భవిష్యత్ అవసరాల కోసం సంస్థకు కొత్త బొగ్గు వనరులు అత్యవసరమని డిప్యూటీ సీఎం వివరించారు. గోదావరి వ్యాలీ పరిధిలోని ‘కొయ్యగూడెం బ్లాక్–III’ తెలంగాణ విద్యుత్ రంగానికి ఎంతో అవసరమని కిషన్ రెడ్డికి గుర్తు చేశారు. గతంలో ఈ బ్లాక్‌ను వేలం వేసినప్పటికీ నాలుగేళ్లుగా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని, కాబట్టి ఆ లీజును రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

Singareni Coal Gasification|తాడిచెర్ల లీజుపై చర్చ..

తాడిచెర్ల కోల్ బ్లాక్–II మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని భట్టి విక్రమార్క కోరారు. ఈ బ్లాక్‌కు సంబంధించి ఇప్పటికే సింగరేణి ప్రాథమిక పనులు, అన్వేషణ పూర్తి చేసిందని, MMDR చట్టం కింద ముందస్తు అనుమతులు మంజూరు చేస్తే పనులు వేగంగా ముందుకు సాగుతాయని వివరించారు. డిప్యూటీ సీఎం ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారానికి, సింగరేణి సరికొత్త ప్రణాళికలపై చర్చించడానికి త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో ఒక జాయింట్ మీటింగ్ (సంయుక్త సమావేశం) ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: HDFC Bank | ఆ బ్యాంక్‌కు ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోం!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *