అక్షరటుడే, వెబ్డెస్క్: US Iran Conflict | అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. జోర్డాన్ Jordan లో జరిగిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మరణించిన నేపథ్యంలో అమెరికా.. ఇరాన్కు చెందిన లక్ష్యాలపై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితిపై ఆందోళనలు మరింత పెరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనికుల మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా అమెరికా చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం.
US Iran Conflict | అమెరికాపై ఇరాన్ తీవ్ర విమర్శలు
మరోవైపు, ఇరాన్ అత్యున్నత నాయకత్వం.. అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించింది. గత నెల ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని (MoU) అమెరికానే పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. అమెరికా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ద్వైపాక్షిక ఒప్పందాల విశ్వసనీయతను ప్రశ్నించింది.
ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కువైట్కు చెందిన ప్రభుత్వ చమురు సంస్థ ప్రకారం, ఇరాన్ దాడుల్లో తమ కీలక చమురు మౌలిక వసతుల్లో ఒకటి దెబ్బతిన్నట్లు వెల్లడించింది. అయితే నష్టం ఎంత మేరకు జరిగిందనే వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.
US Iran Conflict | భద్రతా చర్యలు కట్టుదిట్టం
ఇరాక్లోని ఎర్బిల్ నగరంలో డ్రోన్ దాడుల హెచ్చరికల నేపథ్యంలో అక్కడి అమెరికా కాన్సులేట్ పరిధిలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. గగనతల రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు సమాచారం.
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంత భద్రత, ప్రపంచ ఇంధన సరఫరా, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.