అక్షరటుడే, వెబ్డెస్క్: Vijayasai Reddy | మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ, రాజకీయ రంగాన్ని పూర్తిగా వీడలేదని అర్ధమైంది. కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న ఆయన, ఇటీవల సోషల్ మీడియా (Social Media) ద్వారా వివిధ రాజకీయ అంశాలపై స్పందిస్తూ మళ్లీ చురుకుగా మారారు.
ఈ నేపథ్యంలోనే తన రాజకీయ పునరాగమనం గురించి కీలక ప్రకటన చేశారు. విలేకర్లతో మాట్లాడుతూ, తాను జూలై నెలలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ వ్యాఖ్యలతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Vijayasai Reddy | కొత్త పార్టీతో పాటు, ఛానెల్ కూడా..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పనితీరుపై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి, ప్రజలు ఇచ్చిన తీర్పును ఆ పార్టీ నాయకులు గమనించాలని సూచించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో 2025 జనవరిలో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో తన పదవికి న్యాయం చేయలేకపోతున్నానని పేర్కొంటూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్న ఆయన, మళ్లీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వచ్చారు.

ఇక మీడియా రంగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ వేదిక ద్వారా మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజా గొంతుకగా నిలుస్తామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పని చేయమని, భవిష్యత్లో తెలుగు శాటిలైట్ ఛానెల్ కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇటీవల ఏపీ లిక్కర్ కేసు నేపథ్యంలో తన నివాసంలో జరిగిన ఈడీ సోదాలపై కూడా ఆయన స్పందించారు. ఆ సోదాల్లో ఎలాంటి కీలక అంశాలు బయటపడలేదని తెలిపారు. ఈ పరిణామాల మధ్య ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ప్రకటించడం, కొత్త పార్టీ అవసరం ఉందని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. విజయసాయిరెడ్డి వేసే తదుపరి అడుగులు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: CM Chandrababu Naidu | బిజినెస్ రిఫార్మర్ చంద్రబాబు.. రేపు ముంబైలో ప్రతిష్టాత్మక పురస్కారం!

