అక్షరటుడే వెబ్డెస్క్: West bengal | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, సువేందు అధికారి శనివారం ఆ రాష్ట్ర మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , ఇతర ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సువేందు అధికారితో పాటు దిలీప్ ఘోష్ , మరో నలుగురు నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
West bengal | ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం..
మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 సీట్లను గెలుచుకుని చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ ఫలితంతో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల అప్రతిహత పాలనకు ముగింపు పలికినట్లయింది. ముఖ్యంగా భబానీపూర్ నియోజకవర్గంలో జరిగిన హోరాహోరీ పోరులో సువేందు అధికారి 73,917 ఓట్లను సాధించగా, మమతా బెనర్జీ 58,812 ఓట్లతో ఓటమి పాలయ్యారు. దాదాపు 15,105 ఓట్ల తేడాతో ఆమె పరాజయం చెందడం గమనార్హం.
West bengal | ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని..
ఓటమి అనంతరం మమతా బెనర్జీ తొలుత రాజీనామా చేయడానికి నిరాకరించారు. ఎన్నికల ఫలితాలు పారదర్శకంగా లేవని, ఇవి “ముందుగా సిద్ధం చేసినవి” అని ఆమె విమర్శించారు. దాదాపు 100 స్థానాల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, ప్రజా తీర్పును దోచుకున్నారని ఆమె ఆరోపించారు. తాము బీజేపీతో కాకుండా, ఏకపక్షంగా వ్యవహరించిన ఎన్నికల సంఘంతోనే పోరాడామని ఆమె మండిపడ్డారు.
West bengal | ‘X’ బయో మార్పుతో ఓటమి అంగీకారం
రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో, మమతా బెనర్జీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ (ట్విట్టర్) బయోను అప్డేట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి” అని ఉన్న హోదాను, తాజాగా “ముఖ్యమంత్రి (15వ, 16వ , 17వ విధానసభ)” అని మార్చారు. అంటే ఆమె తన పదవీకాలాన్ని గత మూడు పర్యాయాలకే పరిమితం చేస్తూ సమాచారం ఇవ్వడం ద్వారా, ప్రస్తుత పరాజయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Biscuit Baba| కొత్తగా పుట్టుకొచ్చిన ‘బిస్కెట్ బాబా’.. భక్తి పేరుతో వికృత చేష్టలు

