Women Returnship Program | మహిళా రిటర్న్‌షిప్‌లపై గోద్రెజ్ దృష్టి.. విద్యార్థుల కోసం అద్భుత అవకాశం

వాహం, పిల్లలు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా కెరీర్‌కు విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే మహిళల కోసం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన 'గోద్రెజ్ డీఈఐ (DEI) ల్యాబ్' సరికొత్త కేస్ స్టడీ పోటీని ప్రకటించింది.

Shivam nagarani

అక్షరటుడే వుబ్‌డెస్క్: Women Returnship Program | వివాహం, పిల్లలు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా కెరీర్‌కు విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగాల్లో చేరాలనుకునే మహిళల కోసం గోద్రెజ్ ఇండస్ట్రీస్ ( Godrej Industries ) గ్రూప్‌కు చెందిన ‘గోద్రెజ్ డీఈఐ (DEI) ల్యాబ్’ సరికొత్త కేస్ స్టడీ పోటీని ప్రకటించింది. ‘ఇండియా ఇన్‌క్లూడెడ్ ఆన్ క్యాంపస్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీ రెండో ఎడిషన్ మహిళల రిటర్న్‌షిప్ (తిరిగి ఉద్యోగాల్లో చేరే విధానం) కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశంలోని ఎనిమిది ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ పోటీని విస్తరిస్తుండగా, హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) క్యాంపస్‌లో దీనికి సంబంధించిన రోడ్‌షో ప్రారంభం కానుంది.

Women Returnship Program | పోటీ ముఖ్య ఉద్దేశం..

భారత్‌లో విద్యావంతులైన మహిళల్లో 74 శాతం మంది ఏదో ఒక దశలో కెరీర్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు ‘ది మిస్సింగ్ హాఫ్, 2026’ నివేదిక వెల్లడించింది. అయితే, అనుభవజ్ఞులైన ఈ మహిళలు తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు అనువైన మార్గాలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. ఈ సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ ఛాలెంజ్ ప్రధాన లక్ష్యం. మహిళలు కెరీర్‌లోని వివిధ దశల్లో ఉన్నప్పుడు కార్పొరేట్ సంస్థలు వారికి ఏ విధంగా అండగా నిలవవచ్చనే అంశంపై విద్యార్థులు తమ సరికొత్త ఆలోచనలను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా గోద్రెజ్ డీఈఐ ల్యాబ్ హెడ్ పర్మేష్ సహాని మాట్లాడుతూ.. “కుటుంబ బాధ్యతల వల్ల కెరీర్‌లో వచ్చే విరామం అనేది మహిళలు తిరిగి ఉద్యోగాల్లోకి రావడానికి అడ్డంకి కాకూడదు. మరింత సమ్మిళిత పని ప్రదేశాలను తీర్చిదిద్దడంలో యువ మేనేజ్‌మెంట్ విద్యార్థుల ఆలోచనలను ఆహ్వానించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది” అని తెలిపారు.

Women Returnship Program | బహుమతుల వివరాలు..

గత ఏడాది ప్రారంభమైన ఈ పోటీ మొదటి సీజన్‌లో ఐఐఎం తిరుచ్చి, ఐఐఎం లక్నో, ఐఐఎం ముంబై, ఎస్ఐబీఎం పుణె విద్యార్థులు పాల్గొనగా.. ఐఐఎం తిరుచ్చి విజేతగా నిలిచింది. ఈసారి మరింత విస్తృతంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో విజేతగా నిలిచే బృందానికి రూ.1,00,000 నగదు బహుమతి అందజేస్తారు. అలాగే ఫైనల్స్‌కు చేరిన విద్యార్థులకు గోద్రెజ్ సీనియర్ లీడర్లతో నేరుగా చర్చించే అరుదైన అవకాశం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Samay Raina | స్టాండప్‌ కమెడియన్‌ సమయ్‌ రైనాకు ఊరట

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *