Khaja Moinuddin Murder Case | అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక పురోగతి: వినయ్ స్కెచ్.. ఐదుగురు నిందితులు అదుపులోకి!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khaja Moinuddin Murder Case | హైదరాబాద్ మహా నగరంలో తీవ్ర కలకలం రేపిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ (63) దారుణ హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి కీలక పురోగతి సాధించారు.

గ్రేటర్​ పరిధిలో శనివారం ఉదయం జరిగిన ఈ ఘోర ఘాతుకానికి సంబంధించి పోలీసులు ఐదుగురు నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కవాడిగూడకు చెందిన వినయ్ అనే వ్యక్తి ఈ హత్యోదంతానికి ప్రధాన సూత్రధారిగా (మాస్టర్ మైండ్) పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Khaja Moinuddin Murder Case | మూడు రోజులు రెక్కీ!

పోలీసుల కథనం ప్రకారం.. లాయర్ ఖాజా మొయినుద్దీన్‌ను మట్టుబెట్టేందుకు నిందితులు పక్కా వ్యూహం రచించారు. హత్యకు ముందు మూడు రోజుల పాటు ఆయన కదలికలపై నిరంతర నిఘా ఉంచి ‘రెక్కీ’ నిర్వహించారు.

మాసబ్ ట్యాంక్ శాంతినగర్ ప్రాంతంలోని తన నివాసం వెలుపల పార్క్ చేసి ఉన్న కారును శనివారం తెల్లవారుజామున ఎక్కేందుకు ఖాజా మొయినుద్దీన్ ప్రయత్నిస్తుండగా.. నెంబర్ ప్లేట్ లేని ఓ స్కార్పియో వాహనం వేగంగా దూసుకొచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొదట దీనిని హిట్ అండ్ రన్ కేసుగా భావించారు.

కానీ, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా నాంపల్లి పోలీసులు నిర్ధారించి కేసు నమోదు చేశారు.

Khaja Moinuddin Murder Case | కల్వకుర్తి, గోవాలలో నిందితుల వేట

నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక ఆధారాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలోనే కవాడిగూడకు చెందిన ప్రధాన నిందితుడు వినయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వినయ్ ఇచ్చిన సమాచారంతో పాటు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పారిపోయిన మిగతా నలుగురు నిందితులను పోలీసులు కల్వకుర్తి, గోవాలలో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు ఉపయోగించిన స్కార్పియో కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ కారు అసలు యజమానిని ప్రశ్నించగా.. ఆరు నెలల క్రితమే తాను కారును వేరే వాళ్లకు అమ్మేశానని, అయితే కొనుగోలు చేసిన వ్యక్తులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని వెల్లడించారు.

Khaja Moinuddin Murder Case | వక్ఫ్ భూముల వివాదమే కారణమా?

సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ వక్ఫ్ బోర్డు భూములను రక్షించేందుకు, ఆక్రమణదారులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా న్యాయపోరాటం చేస్తున్నారు.

ఈ భూ వివాదాల నేపథ్యంలోనే ప్రత్యర్థులు కక్ష పెంచుకుని, వినయ్ ద్వారా ఈ హత్యకు స్కెచ్ వేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరికొంత మంది కీలక సూత్రధారుల ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మొత్తానికి న్యాయవాదుల సంఘాలు, రాజకీయ ప్రముఖుల నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమైన నేపథ్యంలో పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని కేసును ఛేదించారు.

నాంపల్లి పోలీసులు సోమవారం అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ హత్యకు గల పూర్తి కారణాలను, నిందితుల వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.

Ananya Infra Land Dispute | “రూ.200 కోట్ల భూమిని రూ.10 కోట్లకే రాసివ్వాలని కాంగ్రెస్ ఎంపీ బెదిరింపులు”.. ‘అనన్య ఇన్ఫ్రా’ సంచలన ఆరోపణలు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *