అక్షరటుడే, వెబ్డెస్క్ : Petrol Price Hike | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రజల జేబులకు పెద్ద దెబ్బగా మారుతోంది. గత కొన్ని రోజుల వ్యవధిలోనే నాలుగు విడతల్లో ఇంధన ధరలు పెరగడంతో లీటరుకు దాదాపు రూ.7.38 వరకు అదనపు భారం పడింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ధరలు కూడా చమురు సంస్థల నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి సంస్థలు అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, దేశీయంగా వినియోగదారులపై వెంటనే భారం మోపకుండా ధరలను కొంతకాలం స్థిరంగా ఉంచడం వల్ల ఈ సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లినట్లు తెలుస్తోంది.
Petrol Price Hike | రూ.1.2 లక్షల కోట్లకు పైగా అదనపు భారం
ఆర్థిక విశ్లేషకుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్ (International Market) ధరలకు దేశీయ రిటైల్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా సరిచేయాలంటే లీటరుపై మరో రూ.20 నుంచి రూ.33 వరకు ధరలు పెంచాల్సిన అవసరం ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఒకేసారి భారీ పెంపు చేస్తే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉన్నందున, దశలవారీగా పెంచే మార్గాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్ (Iran)కు సంబంధించిన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్పై ప్రభావం చూపించాయి. ఇదే సమయంలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో దాదాపు 74 రోజుల పాటు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
Petrol Price Hike | మార్కెట్లో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం
భారత్ తన అవసరాల్లో దాదాపు 88 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా వాటిని నియంత్రించడంతో మూడు ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై సుమారు రూ.1.2 లక్షల కోట్ల వరకు అదనపు భారం పడినట్లు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు సానుకూలంగా ముగిస్తే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ముడి చమురు ధరలు తగ్గినా, ఇప్పటికే పేరుకుపోయిన నష్టాలు, రవాణా ఖర్చులు, పన్నుల భారం కారణంగా వినియోగదారులకు వెంటనే ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. ఇటు ప్రజలపై ద్రవ్యోల్బణ భారం పెరగకుండా చూసుకోవడం, అటు ప్రభుత్వ రంగ చమురు సంస్థలను నష్టాల నుంచి బయటపడేయడం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi on Fuel Price | ఇంధన ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ విమర్శలు


