Gulmarg Gondola | గాల్లోనే ఆగిపోయిన కేబుల్ కార్లు.. పర్యాటకుల కోసం ఆర్మీ ఆపరేషన్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gulmarg Gondola |ఉత్తర కాశ్మీర్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్‌లో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ప్రముఖ కేబుల్ కార్ సర్వీస్ అయిన ‘గుల్మార్గ్ గోండోలా’ (Gulmarg Gondola) లో ఆకస్మికంగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గాలిలో ప్రయాణిస్తున్న కేబుల్ కార్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో దాదాపు 300 మంది పర్యాటకులు గాలిలోనే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ, స్థానిక పోలీసులు , విపత్తు నిర్వహణ దళాలు (SDRF) కలిసి పర్యాటకులను రక్షించడానికి ఒక భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

Gulmarg Gondola | మధ్యాహ్నం నుంచి నిలిచిన సర్వీసులు

సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తిందని గుల్మార్గ్ డెవలప్‌మెంట్ అథారిటీ (GDA) సీఈఓ తారిఖ్ హుస్సేన్ నాయక్ వెల్లడించారు. గోండోలా యొక్క మొదటి దశ (ఫేజ్-1) లో ఈ లోపం రావడం వల్ల, ముందుజాగ్రత్త చర్యగా రెండు దశల కార్యకలాపాలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. కాగా, ఈ గోండోలా ప్రాజెక్టులో మొదటి దశ గుల్మార్గ్ నుండి 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న కొంగ్దూరి వరకు, రెండవ దశ అక్కడ నుండి 3,979 మీటర్ల ఎత్తులో ఉండే అఫర్వత్ శిఖరం వరకు పర్యాటకులను తీసుకెళ్తుంది.

Gulmarg Gondola | యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

గాలిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దించేందుకు సైన్యానికి చెందిన హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్ (HAWS) నిపుణులు, ఎస్డీఆర్ఎఫ్ , రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. పర్యాటకులకు కొండ కింద తక్షణ వైద్య సహాయం అందించేందుకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని కూడా మోహరించారు. అలాగే కొండ ప్రాంతాల నుండి పర్యాటకులను తరలించడానికి స్థానిక గుర్రపు బగ్గీ నిర్వాహకుల సేవలను కూడా అధికారులు వాడుకుంటున్నారు.

Gulmarg Gondola | సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యవేక్షణ

గుల్మార్గ్‌లో నెలకొన్న ఈ ఉత్కంఠ భరిత పరిస్థితిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వయంగా నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. కేబుల్ కార్ క్యాబిన్‌లన్నీ క్షేమంగానే ఉన్నాయని, పర్యాటకులను సురక్షితంగా తరలించే పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎలాంటి అనాధికారిక లేదా తప్పుడు సమాచారాన్ని షేర్ చేయవద్దని జమ్మూ కాశ్మీర్ పోలీసులు కోరారు.

ఇది కూడా చదవండి: Lorry Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడు కార్లను ఢీకొట్టిన లారీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *