అక్షరటుడే వెబ్డెస్క్: Veena Vijayan ED Notice | కేరళ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జూన్ 12న కొచ్చిలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు ఆమెను ఆదేశించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వీణా విజయన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
Veena Vijayan ED Notice | అసలు కేసు ఏమిటి?
కేరళకు చెందిన ప్రముఖ ఖనిజ ఇసుక సంస్థ ‘సీఎంఆర్ఎల్’ (CMRL) , వీణా విజయన్కు చెందిన సాఫ్ట్వేర్ సంస్థ ‘ఎక్సాలాజిక్ సొల్యూషన్స్’ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఐటీ సేవలు అందించినట్లు చూపుతూ సీఎంఆర్ఎల్ సంస్థ ఎక్సాలాజిక్కు సుమారు రూ. 2.78 కోట్లు చెల్లించిందని ఈడీ ఆరోపిస్తోంది. అయితే, ఈ నిధులు నిజమైన వ్యాపార సేవల కోసం ఇచ్చినవా? లేక అక్రమ మార్గంలో మళ్లించిన నేరపూరిత ఆదాయమా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
Veena Vijayan ED Notice | నివేదికల్లో ఏముంది?
ఇంతకుముందు ఈ వ్యవహారాన్ని పరిశీలించిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ముమ్మరం చేసింది. విద్యాసంస్థల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఎక్సాలాజిక్ సంస్థకు, సీఎంఆర్ఎల్ నెలవారీగా రూ. 8 లక్షల కన్సల్టెన్సీ ఫీజు చెల్లించినప్పటికీ.. దానికి తగ్గట్లుగా ఎలాంటి ఐటీ సేవలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. దీనితో పాటు, సీఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిధరన్ కర్తాకు చెందిన మరో సంస్థ ‘ఎంపవర్ ఇండియా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్’ నుండి ఎక్సాలాజిక్ సంస్థకు రూ. 50 లక్షల మేర రుణాలు అందాయని, ఈ లావాదేవీల వెనుక వ్యాపార హేతుబద్ధత లోపించిందని అధికారులు అనుమానిస్తున్నారు.

Veena Vijayan ED Notice | విచారణ వేగం..
ఈ కేసు దర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ స్వయంగా కేరళలో పర్యటించారు. గత నెలలోనే తిరువనంతపురంలోని వీణా విజయన్ నివాసం, కార్యాలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈడీ సోదాలు కూడా నిర్వహించింది. ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున నిధులు మళ్లించారని ఈడీ భావిస్తోంది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ వీణా విజయన్ తీవ్రంగా ఖండించారు. సీఎంఆర్ఎల్ , ఎక్సాలాజిక్ సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా చట్టబద్ధమైనవని, పారదర్శకంగా వ్యాపార నిబంధనల ప్రకారమే జరిగాయని ఆమె కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Steel Plant Compensation | స్టీల్ప్లాంట్ ఘటన.. పరిహారం ప్రకటించిన పవన్
