అక్షరటుడే, వెబ్డెస్క్ : Case on Ambati Rambabu | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
శనివారం గుంటూరు కలెక్టరేట్ (Guntur Collectorate) ముందు ఆయన చేపట్టిన నిరసన దీక్ష ఈ కేసుకు కారణమైంది. పోలీసుల వివరాల ప్రకారం, ముందస్తు అనుమతి లేకుండా కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగడం, దీని వల్ల ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగిందని ఆరోపిస్తూ నగరపాలెం పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఆందోళన నిర్వహించడమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
Case on Ambati Rambabu | పోలీసులని సస్పెండ్ చేయాలి…
అంబటి రాంబాబు తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదని నిరసిస్తూ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని, అలాగే గతంలో కస్టడీలో తనను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షను మాజీ మంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharita) నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా అంబటి తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ వివాదానికి మూలం జనవరిలో జరిగిన సంఘటన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనవరి 31న పోలీసులు అంబటిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన ఇంటిపై దాడి జరిగినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి.

Case on Ambati Rambabu | 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో
అరెస్ట్ అనంతరం సుమారు 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న అంబటి, ఫిబ్రవరి 18న బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తనపై జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతోనే ఈ తాజా కేసును నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిణామంతో అంబటి రాంబాబు వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఇది కూడా చదవండి..: Streenidhi Loan Scheme | డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.రెండు లక్షల లోన్

