అక్షరటుడే, కామారెడ్డి: Employee Health Cards | హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులకు ఎలాంటి అపోహలు వద్దని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావద్దని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని పీఆర్టీయూ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తోందని, దీనిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదని తెలిపారు. ఈ ట్రస్ట్ కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి 1.5 శాతం కోత విధించారని, ముందస్తు సమాచారం లేకుండా వేతనం కట్ కావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. హెల్త్ కార్డ్ స్కీమ్ అమల్లోకి వస్తే కోత విధించినా ఎలాంటి ఇబ్బంది లేదని, విధివిధానాలు లేకపోవడం, ట్రస్ట్ ఏర్పాటు కాకముందే 1.5 శాతం కట్ కావడంతో గందరగోళం ఏర్పడిందని వివరించారు.
Employee Health Cards | త్వరలో ఉత్తర్వులు

ఇటీవల సీఎస్ రామకృష్ణారావుతో జరిగిన సమావేశంలో ట్రస్ట్ ఏర్పాటుకు 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒక్కరి నుంచే 1.5 శాతం కట్ అవుతుందని, జూన్ 10 నుంచి హెల్త్ కార్డ్ స్కీము ద్వారా నగదు రహిత చికిత్స అమలులోకి వస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కేవలం భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తే, ట్రస్ట్ ద్వారా కుటుంబంలో ఆరుగురికి వర్తిస్తుందని పేర్కొన్నారు. 1.5 శాతం కోత ద్వారా ప్రతి నెల ట్రస్టుకు రూ.44 కోట్లు, ప్రభుత్వం తరఫున మరో రూ.44 కోట్లు జమ అవుతాయన్నారు. ఏడాదికి రూ.1,036 కోట్ల నిధులు ట్రస్ట్లో జమ అవుతాయని పేర్కొన్నారు.
Employee Health Cards | 54 ఏళ్ల క్రితం

పీఆర్టీయూ 54 సంవత్సరాల క్రితం పీఆర్టీయూ ఏర్పడిందని, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అత్యధికంగా డీఏలు బకాయి పడిందని, ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 3 డీఏలు ఇచ్చిందని అన్నారు. 01.07.2023 నుంచి పీఆర్సీ రావాల్సి ఉందని, అందుకే పీఆర్సీ ముందు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.ఈ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అల్జాపూర్ కుషాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నర్సారెడ్డి, కమిటీ సభ్యుడు గోవర్ధన్, హన్మాండ్లు, రాజు, స్వప్న, విజయ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Rahul Revanth BC Justice | బీసీలకు న్యాయం చేస్తున్న రాహుల్, రేవంత్


