అక్షరటుడే, కామారెడ్డి: Modi Telangana Visit | తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన పక్కా పొలిటికల్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) అన్నారు. కామారెడ్డి (Kamareddy) బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Modi Telangana Visit | ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం మొట్టమొదటి సారిగా తెలంగాణాలో ప్రధాని మోదీ పర్యటించడం (Modi Telangana Visit) ప్రతిపక్ష పార్టీలలో తాజా చర్చకు దారి తీసిందన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని, ఇక రీజినల్ పార్టీలలో అందరికి అభద్రతాభావం, వణుకు మొదలైందన్నారు. వెస్ట్ బెంగాల్లో రీజినల్ పార్టీగా ఎదిగిన ప్రాంతంలో మమతా బెనర్జీని ఓడించడం డిఫరెంట్ లెవల్ అని పేర్కొన్నారు. అక్కడ గెలిచిన పార్టీ ఎక్కడైనా గెలుస్తుందని చెప్పారు. తెలంగాణలో రూ.7,823 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు.
జహీరాబాద్ (Zaheerabad) పార్లమెంట్ నియోజకవర్గంలో రూ.2,360 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Integrated Industrial Smart City) పనులకు శంకుస్థాపన, ఇతర రాష్ట్రాల నుంచి మహబూబ్నగర్ (Mahabubnagar) 161 నేషనల్ హైవేపై నాలుగు లైన్ల రహదారి పనులకు రూ.3,175 కోట్లు పీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే అమృత్ భారత్ పథకం కింద రూ.40 కోట్లతో ఆధునీకరించిన రెండు రైల్వే స్టేషన్లు, రూ.200 కోట్లతో వరంగల్లో నిర్మించిన పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కు, రూ.611 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్స్, రూ.1243 కోట్లతో కాజీపేట-విజయవాడ వరకు మూడు లైన్ల రైల్వే పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ఎంపీ వివరించారు.
Modi Telangana Visit | హైదరాబాద్లో భారీ బహిరంగసభ..
అనంతరం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో (Hyderabad Parade Ground) సుమారు మూడు లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పీఎం పాల్గొంటారని పేర్కొన్నారు. తెలంగాణలో మోదీ పర్యటనతో కేసీఆర్, రేవంత్ రెడ్డిలతో పాటు ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలవుతుందన్నారు. ఈ పార్టీలన్నీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి భవిష్యత్తులో వారి సమాధిని వారే తవ్వుకున్నారన్నారు. వచ్చే 17వ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయిస్తామని, ఎవరు వ్యతిరేకంగా ఓటు వేసినా ఆగదన్నారు. అయితే మెజారిటీ 543 ఉంటుందా.. 800 ఉంటుందా.. 700 ఉంటుందా అనేది చెప్పలేమన్నారు.
గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో ఎవరు ఏమిటో, ఏ పార్టీ వ్యతిరేకమో బట్టబయలైందన్నారు. తెలంగాణలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎవరిపై ప్రభావం చూపదన్నారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆమె తండ్రి, అన్న చేసినవన్నీ బయటపెడుతుందన్నారు. లిక్కర్ స్కాంలో ఎవిడెన్స్ లేవని మాత్రమే కోర్టు చెప్పిందన్నారు. ఆ కేసులో సీబీఐ ఎంటరైందని పేర్కొన్నారు. ఎవిడెన్స్ లేవని చెప్పినంత మాత్రాన స్కాం జరగలేదని కాదన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో ఎవరూ సుద్దపూసలు లేరని వ్యాఖ్యానించారు. కవిత టీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ సపోర్ట్ ఉందని విమర్శించారు. అంతిమంగా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, అరుణ తార, బీజేపీ రాష్ట్ర నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:IPL 2026 Second Half | ఐపీఎల్లో ఉత్కంఠ రేపుతున్న సెకండాఫ్.. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు

