అక్షరటుడే వెబ్డెస్క్: Mamata Banerjee Protest | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘోర పరాజయాన్ని చవిచూడటం, బీజేపీ విజయం సాధించి అధికారంలోకి రావడం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాజకీయ హింస చెలరేగింది. ముఖ్యంగా టీఎంసీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతలే లక్ష్యంగా చేసుకొని కొందరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) కోల్కతా వేదికగా ఒకరోజు నిరసన దీక్షకు దిగారు. నగరంలోని ప్రముఖ సెంట్రల్ ప్రాంతమైన ఎస్ప్లానేడ్ వై-ఛానల్ (Esplanade’s Y-channel) వద్ద ఆమె ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Mamata Banerjee Protest | పోలీసుల ఆంక్షలు..
మమతా బెనర్జీ చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనకు కోల్కతా పోలీసుల నుంచి తీవ్ర ఆంక్షలు ఎదురయ్యాయి. అంతకుముందు, ఎస్ప్లానేడ్ పక్కనే ఉన్న రాణి రాష్మణి రోడ్లో ధర్నా నిర్వహించేందుకు టీఎంసీ అనుమతి కోరగా.. పోలీసులు ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఈ సందర్భంగా దీక్షా స్థలంలో కూడిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నిరసన వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కానీ, కనీసం మైకులు ఉపయోగించడానికి కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఆమె వెనక్కి తగ్గకుండా, మైకుకు బదులుగా మెగాఫోన్ (Megaphone) చేతితో పట్టుకుని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన పట్టుదలతో ఆంక్షల నడుమే దీక్షను కొనసాగించి సంచలనం రేపారు.

ఇది కూడా చదవండి: Rahul Revanth BC Justice | బీసీలకు న్యాయం చేస్తున్న రాహుల్, రేవంత్


