అక్షరటుడే వెబ్డెస్క్: Ebola Outbreak Congo | ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఎబోలా వైరస్ ( Ebola Virus ) తీవ్ర రూపం దాల్చుతోంది. ఒకవైపు కేసులు పెరుగుతుండగా, మరోవైపు క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Ebola Outbreak Congo |పేషెంట్ల పరార్..
ఇటూరి ప్రాంతంలోని ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఎబోలా సోకిన 11 మంది రోగులు తప్పించుకుపోవడం కలకలం రేపింది. సంక్రమణ వేగంగా ఉండే ఈ వైరస్ బాధితులు సమాజంలో తిరగడం వల్ల వ్యాధి మరింత విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో సాయుధ ముఠాలు వైద్య సాయానికి ఆటంకాలు కలిగిస్తుండటంతో అక్కడ భద్రతా సమస్యలు తలెత్తాయి.

Ebola Outbreak Congo |అంత్యక్రియల బృందంపై దాడి..
దక్షిణ కివు ప్రావిన్స్లోని కటానా పట్టణంలో ఒక ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఎబోలాతో మరణించిన ఒక వ్యక్తికి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న హెల్త్ టీమ్పై స్థానికులు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రాణభయంతో ఆ బృందం మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత స్థానికులే నేరుగా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎబోలా సోకిన శవాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి, ఈ ఘటన వల్ల వైరస్ మరింత విజృంభించే ఛాన్స్ ఉందని అధికారులు భయపడుతున్నారు.

Ebola Outbreak Congo |పెరుగుతున్న మరణాలు..
కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు మొత్తం 363 ఎబోలా కేసులు నమోదయ్యాయి. బుండిబుగ్యో వైరస్ రకం కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, బాధితులను గుర్తించే ప్రక్రియలో కొంత పురోగతి కనిపిస్తోందని అధికారులు చెప్తున్నారు. ఇటు పొరుగు దేశమైన ఉగాండాలోనూ 15 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. వైరస్ ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో గట్టిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: Janhvi Kapoor Tirumala | శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
