అక్షరటుడే, ఇందూరు: Fertilizer Stocks | జిల్లాలోని అన్ని సహకార సంఘాల గోడౌన్లు, సేల్ పాయింట్లలో రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని.. ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ (janakampet), ఎడపల్లిలో (Yedapally) ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు.
Fertilizer Stocks | ఎరువుల నిల్వలపై ఆరా..
గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను (Fertilizer Distribution) కలెక్టర్ పరిశీలించారు. స్టాక్, రిజిస్టర్లో పొందుపర్చిన వివరాలతో సరిపోల్చుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని ఎరువుల బస్తాలు వచ్చాయి.. ఎన్ని పంపిణీ చేశారు.. ఎంత పంపిణీ చేయాల్సి ఉందనే వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. యూరియా బుకింగ్ యాప్ పనితీరును కలెక్టర్ స్వయంగా పరిశీలన జరిపి, యాప్ వల్ల సమకూరే ప్రయోజనాల గురించి రైతులకు వివరించారు. మన రాష్ట్రంలో అమలు అవుతున్న బుకింగ్ యాప్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఎరువుల పంపిణీ కోసం అమలు చేస్తున్నాయన్నారు. ఈ యాప్ వల్ల ఎలాంటి నష్టం లేదని, గత రబీ సీజన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
Fertilizer Stocks | ఎరువుల బుకింగ్ యాప్తో లాభాలెన్నో..
ఎరువులు పక్కదారి పట్టకుండా, పారదర్శకంగా, ప్రణాళికాబద్దంగా యూరియా పంపిణీకి బుకింగ్ యాప్ దోహదపడుతుందని, దీని విషయంలో రైతులు అపోహలకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రయోగాత్మకంగా కొంత పరిమాణంలో నానో యూరియాను వినియోగించి ఫలితాలను స్వయంగా పరిశీలించాలని రైతులకు హితవు పలికారు. అయితే రైతులను నానో యూరియా కొనాలని బలవంతం చేయవద్దని, వారు కోరిన ఎరువులు మాత్రమే అందించాలన్నారు. ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Fertilizer Stocks | 27వేల మెట్రిక్ టన్నులు
జిల్లా రైతుల అవసరాలకు సరిపడా ప్రస్తుతం 27 వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని పాలనాధికారి పేర్కొన్నారు. ఎక్కడ కూడా కొరత ఏర్పడకుండా రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను చేరవేస్తున్నామని తెలిపారు. పలు సొసైటీలు డిఫాల్ట్లో ఉండగా, వాటి పరిధిలోని రైతులకు సైతం ఇబ్బందులు తలెత్తకూడదని, స్థానికంగానే వారికి ఎరువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో డీసీఎంఎస్ ద్వారా ఎరువుల పంపిణీ జరిపిస్తున్నామన్నారు.
Fertilizer Stocks | ముందుగా విత్తుకునే బోధన్ తదితర ప్రాంతాల్లో..
పంటలు విత్తుకునే బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియను (Telangana Agriculture) ప్రారంభించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. తదుపరి నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా పక్కాగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామని, స్టాక్ పాయింట్లకు ఎరువుల నిల్వలు చేరవేశామని వివరించారు. మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ దత్తాద్రి, జానకంపేట్ సర్పంచ్ అనురాధ, సొసైటీ ఛైర్మన్ నరేందర్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Mohan Naik ACB Raid | ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. 100 కోట్ల పైచిలుకు ఆస్తులు?
