అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Paddy Procurement | తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు నమోదైందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar ) ప్రకటించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు.
Telangana Paddy Procurement | రూ.35,077 కోట్ల జమ..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.35,077 కోట్లను జమ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 65.91 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేయగా, కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకే పరిమితం కావాలని సూచించినప్పటికీ, తాము రైతు ప్రయోజనాల దృష్ట్యా 75 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామని వివరించారు.

Telangana Paddy Procurement | దేశంలోనే అగ్రగామిగా ..
దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వరిలో 61 శాతం తెలంగాణ నుంచే వస్తోందని మంత్రి గర్వంగా చెప్పారు. పక్క రాష్ట్రమైన ఏపీతో పోలిస్తే అక్కడ కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే కొనుగోలు చేశారని, యాసంగి పంట సేకరణలో కూడా ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణనే ముందుందని స్పష్టం చేశారు.
Telangana Paddy Procurement | బీఆర్ఎస్, బీజేపీలపై ఆగ్రహం..
ధాన్యం కొనుగోళ్లలో తాము అనుసరిస్తున్న విధానాల వల్ల మహిళా సంఘాలు , పీఏసీఎస్ (PACS) సంస్థలు బలోపేతం అవుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, వారికి రూ.171 కోట్లు కమిషన్ రూపంలో అందించామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం ధాన్యం సేకరణలో మెరుగైన పనితీరు కనబరిచిందని మంత్రి అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు అర్థరహితమైన ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Fertilizer Stocks | ఎరువుల కొరత లేదు.. రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్ స్పష్టీకరణ
