అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ (Nizamabad) ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక వైద్య విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి, ఐఎంఏ నిజామాబాద్ అధ్యక్షుడు డాక్టర్ విశాల్ (Vishal Akula) ఆకులకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జాతీయ ప్రధాన కార్యాలయం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘డాక్టర్ కేతన్ దేశాయ్ – ఆవో గావ్ చలేన్ అవార్డు (గ్రామీణ వైద్య సేవలు) అవార్డను విశాల్కు అందజేసింది.
IMA National Award | రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా..
న్యూఢిల్లీలోని కాస్ట్రిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవ అవార్డుల కార్యక్రమంలో దేశ రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా విశాల్ అవార్డును అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మానసిక ఆరోగ్య అవగాహన, వ్యసన విముక్తి కార్యక్రమాలు, వైద్య విద్య, సామాజిక సేవలలో విశిష్ట సేవలను గుర్తించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ జాతీయ పురస్కారానికి డా. విశాల్ ఆకులను ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, ఈ అరుదైన జాతీయ గౌరవాన్ని అందించిన ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు అనిల్కుమార్ నాయక్, గౌరవ ప్రధాన కార్యదర్శి సర్బరీ దత్తా, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారాన్ని తన గురువులు, సహచర వైద్యులు, కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు, మానసిక ఆరోగ్య పరిరక్షణ, వ్యసన నిర్మూలన కోసం మరింత అంకితభావంతో సేవలు కొనసాగిస్తానని విశాల్ ఆకుల తెలిపారు. ఆయన త్వరలోనే ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు.
ఇది కూడా చదవండి: బోడుప్పల్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్లో పాల్గొన్న #Nagachaitanya & #SobhitaDhulipala