అక్షరటుడే వెబ్డెస్క్:Double Bedroom Houses | ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో( Double Bedroom Houses ) మౌలిక వసతులు పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులందరూ అక్కడ నివసించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీ. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఇండ్లు వచ్చినా ఇంకా కాలనీల్లోకి మారకుండా ఉంటున్న వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. అప్పటికీ స్పందించకపోతే వారి కేటాయింపులను రద్దు చేసి, ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న ఇతర పేదలకు ఆ ఇళ్లను కేటాయిస్తామని హెచ్చరించారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆయన బౌరంపేట, గండిమైసమ్మ, దుండిగల్ ప్రాంతాల్లోని 2 బీహెచ్కే కాలనీలను సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Double Bedroom Houses |మారకపోతే కేటాయింపులు రద్దు..
దుండిగల్ ఫేజ్-1 కాలనీని పరిశీలించిన ఎండీ గౌతమ్, అక్కడ ఇండ్లు పొంది కూడా చాలా మంది నివాసం ఉండటం లేదనే విషయాన్ని గుర్తించారు. ఎంతోమంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న తరుణంలో, ఇల్లు వచ్చినా ఉండటానికి ముందుకు రాని వారిపై చర్యలు తప్పవన్నారు. అలాగే, దుండిగల్ ఫేజ్-2లో పెండింగ్లో ఉన్న మిగిలిన పనులను, మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.
Double Bedroom Houses |5 కిలోమీటర్ల పరిధి వారికే ..
డబుల్ బెడ్రూమ్ కాలనీకి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికే ఆ ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఎండీ గౌతమ్ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సొంత ఇల్లు లేని అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం తహశీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే జరుగుతోందని వివరించారు. గండిమైసమ్మ ప్రాంతంలో అధికారులు నిర్వహిస్తున్న ఈ సర్వే ప్రక్రియను కలెక్టర్తో కలిసి ఆయన పరిశీలించారు.
Double Bedroom Houses | వేగంగా లబ్ధిదారుల ఎంపిక..
సర్వే వివరాలను యాప్లో సమగ్రంగా అప్లోడ్ చేయాలని, సర్వే పూర్తయిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరికి సూచించారు. ఈ పర్యటనలో హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్యకుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయకుమార్, హౌసింగ్ బోర్డు సీఈ జీవీ రమణారెడ్డి, జిల్లా హౌసింగ్ పీడీ రమణమూర్తితో పాటు రెవెన్యూ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Helicopter Crash | పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది మృతి
