అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR on Metro Phase 2 | మెట్రో రెండో దశకు నిధులు రాకుండా కేటీఆర్తో కలిసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
మెట్రో ఫేజ్-2 సాధనలో రేవంత్ (CM Revanth) సర్కార్ అట్టర్ప్లాప్ అయిందని విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో సీఎం ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధానిని ప్రశ్నించలేక ప్రతిపక్షంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం రేవంత్ను పట్టించుకోవట్లేదన్నారు. తనపై ఓటుకు నోటు కేసు ఉండటంతో కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు.
KTR on Metro Phase 2 | ఆ ఘనత కేసీఆర్దే..
హైదరాబాద్ మెట్రో రైలు పూర్తి చేసిన ఘనత కేసీఆర్దేనని కేటీఆర్ అన్నారు. నాడు కాంగ్రెస్ 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిందన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రత్యేక చొరవ మెట్రో ప్రాజెక్ట్ పూర్త చేశారని పేర్కొన్నారు. తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని ఆరోపించారు.
KTR on Metro Phase 2 | ఎల్అండ్టీపై బెదిరింపులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్అండ్టీపై బెదిరింపులకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. మెట్రో ఫేజ్-2కు ఆ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని ప్రశ్నించారు. ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్ఓనే బెదిరించి పారిపోయేలా చేసింది మీరే కదా అన్నారు. మెట్రోకు చెందిన ఆస్తులను కాజేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
దీనిని కూడా చదవండి : Child Marriage Prevention | బాల్య వివాహాలు సామాజిక సమస్య : మంత్రి సీతక్క