అక్షరటుడే వెబ్డెస్క్: Kishan Reddy Response | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy ) తిప్పికొట్టారు. కేంద్రం సహకరించడం లేదన్న ఆరోపణలు అవాస్తవమని, తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. మెట్రో ప్రాజెక్టుల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని పాటిస్తున్నామని, హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక అంశాలపై సహకరిస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని ఆయన తెలిపారు.
Kishan Reddy Response | సర్టిఫికెట్ అవసరం లేదు..
తమకు లేదా ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదని, తాము జవాబుదారీగా ఉండాల్సింది తెలంగాణ ప్రజలకు మాత్రమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో ఎవరూ తమకు పాఠాలు చెప్పనక్కర్లేదని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామనే విమర్శలపై స్పందిస్తూ, దొడ్డిదారిన అభివృద్ధిని ఆపే సంస్కృతి భాజపాకు లేదని, అది కాంగ్రెస్ వారికే చెల్లుతుందని విమర్శించారు. ఎవరి కోసం కూడా తాము ప్రాజెక్టులను అడ్డుకోబోమని తేల్చి చెప్పారు.

Kishan Reddy Response | ప్రధాని చేతుల మీదుగా..
గతంలో కేసీఆర్ ప్రభుత్వం సహకరించకపోయినా, ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులను ప్రధాని చేతుల మీదుగా పూర్తి చేశామని గుర్తు చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణకు సాధించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్రం నిధులు ఇస్తుంటే, కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించడం దిగజారుడు రాజకీయాలని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టుకు ఏడీబీ రుణం కోసం ఎన్వోసీ ఇవ్వడం, ఎన్సీడీసీ ద్వారా పదేళ్లలో రూ. లక్ష కోట్లు మంజూరు చేయడం, ధాన్యం కొనుగోళ్ల కోసం రూ. 37 వేల కోట్లు విడుదల చేయడం వంటి పనులే కేంద్రానికి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనుల కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
ఇది కూడా చదవండి: Adluri Challenge | హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బహిరంగ సవాల్