అక్షరటుడే, వెబ్డెస్క్ : Singareni Coal Transport | ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు సింగరేణి బొగ్గు, హైదరాబాద్ (Hyderabad) నగరం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల ప్రతిపక్షాలతో పాటు పాలకపక్ష నాయకులు సైతం సింగరేణిని సందర్శించారు. సింగరేణిలో బొగ్గు మాయం అయిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ (SCCL) కీలక ప్రకటన విడుదల చేసింది.

సింగరేణి బొగ్గు దొంగిలించబడిందని, అదృశ్యమైందని కొన్ని మీడియా సంస్థలలో వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) స్పష్టం చేసింది. బొగ్గు ఉత్పత్తి, నిల్వల నిర్వహణ, రవాణా, అమ్మకాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు అధునాతన సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణలో పూర్తి పారదర్శకతతో జరుగుతున్నాయని వివరించింది.
Singareni Coal Transport | రైళ్ల ద్వారా..
గనులలో బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడికి చేరే వరకు, ప్రతి దశ డిజిటల్గా నమోదు చేస్తామని సంస్థ తెలిపింది. సుమారు 85 శాతం బొగ్గును రైల్వేల ద్వారా, 15 శాతం రోడ్డు రవాణా ద్వారా సరఫరా చేస్తున్నట్లు వివరించింది. అయితే ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. రోడ్డు మార్గంలో బొగ్గును రవాణా చేసే ప్రతి వాహనాన్ని ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జ్ల వద్ద తూకం వేస్తారు. జీపీఎస్ సాయంతో వాటిని ట్రాకింగ్ చేస్తారు. అంతేగాకుండా ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక భద్రతా గస్తీలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. బొగ్గు అదృశ్యమైందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని యాజమాన్యం ఖండించింది.
దీనిని కూడా చదవండి : Overloaded Vehicles Seized | రవాణాశాఖ కొరడా.. ఓవర్ లోడ్ వాహనాల సీజ్