అక్షరటుడే వెబ్డెస్క్: Special Intensive Revision | భారత ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియకు జాతీయ గుర్తింపు లభించింది. ఎన్సీఈఆర్టీ (NCERT) రూపొందించిన 9వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకం ‘అండర్స్టాండింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్’లో ఈ ప్రక్రియను ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చారు.
Special Intensive Revision | ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం..
అర్హులైన పౌరులెవరూ ఓటరు జాబితాకు దూరంగా ఉండకూడదనేది ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా, 18 సంవత్సరాలు నిండిన యువతకు అవగాహన కల్పించి వారిని ఓటర్లుగా నమోదు చేయించడంపై ఇది దృష్టి సారిస్తుంది. అదే సమయంలో, నకిలీ ఓటర్లు జాబితాలో చేరకుండా నిరోధించేందుకు ఇది అత్యంత కీలకంగా మారింది. మరణించిన వారి పేర్లు, నివాస మార్పు, నకిలీ నమోదులు, శాశ్వతంగా ఆచూకీ తెలియని వ్యక్తుల వివరాలను ఈ సవరణ ద్వారా ఎప్పటికప్పుడు తొలగిస్తారు.
Special Intensive Revision | ఎన్నికల సంఘం కృషికి గుర్తింపు..
దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు, లక్షలాది పోలింగ్ కేంద్రాలు, వందలాది రాజకీయ పార్టీలతో ఎన్నికలు నిర్వహించడం ఒక సవాలుతో కూడుకున్న పని అని ఎన్సీఈఆర్టీ పేర్కొంది. నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం, బెదిరింపులు వంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారత ఎన్నికల సంఘం ఎంతో సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తోందని పాఠ్యపుస్తకంలో ప్రశంసించారు.
Special Intensive Revision | 65 లక్షల నకిలీ పేర్లను తొలగించడం..
SIR ప్రక్రియ అమల్లోకి వచ్చి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో, ఈ ప్రయాణంలోని ప్రధాన ఘట్టాలు అత్యంత ప్రభావవంతంగా కనిపిస్తున్నాయి. మొదటగా బిహార్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి, సుమారు 65 లక్షల నకిలీ పేర్లను విజయవంతంగా తొలగించడంతో ఈ ప్రక్రియకు శ్రీకారం పడింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు, కేరళతో సహా 9 రాష్ట్రాలు , 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సవరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల నకిలీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం ఒక రికార్డుగా నిలిచింది. ప్రస్తుతం మిగిలిన రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Armoor BT Roads | ఐదు నెలలకే రోడ్లకు పగుళ్లు.. రూ. కోట్ల ప్రజాధనం వృథా..