అక్షరటుడే వెబ్డెస్క్: Kishan Reddy Comments | హైదరాబాద్ నగరంలో అక్రమ వలసదారుల వ్యవహారంపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ( Kishan Reddy ) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలో రోహింగ్యాలతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు అక్రమంగా స్థిరపడటమే కాకుండా, వారికి రేషన్ కార్డులు, ఓటు హక్కు, బ్యాంక్ ఖాతాలు కూడా ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
Kishan Reddy Comments | అక్రమ వలసదారుల దందాపై ఆరోపణలు..
రామ్కోఠిలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను పరిశీలించి, చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నగరంలో ఉన్న అక్రమ వలసదారులకు ప్రభుత్వ పరంగా వస్తున్న సదుపాయాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ ఓటు హక్కు కల్పించడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

Kishan Reddy Comments | బీఎల్ఓలపై మజ్లిస్ నేతల బెదిరింపులు..
పాతబస్తీలో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను మజ్లిస్ నేతలు అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పనిచేసే బూత్ లెవల్ అధికారులను (BLO) భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. విధుల్లో ఉన్న అధికారులను బెదిరించడం ద్వారా వారు ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
Kishan Reddy Comments | ఓటర్ సవరణను అడ్డుకుంటే సహించం..
సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ ప్రక్రియను ఆపలేమని తేల్చి చెప్పారు. పారదర్శకమైన ఓటర్ జాబితా కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజలందరూ ఈ సవరణకు సహకరించాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: Venezuela Earthquake Miracle | మృత్యుంజయురాలు.. వెనెజువెలా శిథిలాలలో బయటపడ్డ 18 రోజుల పసికందు