అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rice Exports | తెలంగాణలో బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ (Hyderabad)లోనీ ఓ ప్రైవేట్ హోటల్లో కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన మల్టీ విటమిన్ రైస్ ఉత్పత్తులను సోమవారం మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బియ్యానికి దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Telangana Rice Exports | ప్రత్యేక కార్యాచరణ
భారత ఆహార సంస్థ (FCI) రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది గానీ ఎగుమతుల కోసం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానంతో ముందుకు వెళ్లి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రైతులు, మిల్లర్ల ప్రయోజనాల కోసం దేశీయ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లను కూడా లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎగుమతులు చేపట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన అనుమతులను సైతం వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
Telangana Rice Exports | 300 లక్షల టన్నులు

వానాకాలం, యాసంగి సీజన్లను కలిపి చూస్తే రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి 300 లక్షల మెట్రిక్ టన్నులు దాటిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజల వినియోగం సంవత్సరానికి కేవలం 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండటంతో తెలంగాణ ఇప్పుడు మిగులు బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. మల్టీ విటమిన్ రైస్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి ఆదరణ పొందే అవకాశముందని చెప్పారు. తెలంగాణలో మాత్రమే విక్రయాలపై ఆధారపడకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు.
దీనిని కూడా చదవండి : Khamenei Funeral | ఖమేనీ అంత్యక్రియలు.. భారత్ తరఫున హాజరుకానున్నది వీరే..!